జగన్ పార్టీని కుదిపేస్తున్న అసమ్మతి, నేతలు దూరం
కరెంట్ సమస్యపై వైయస్ విజయమ్మ చేసిన దీక్షకు కొండా సురేఖ రాలేదు. తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే గెలుపొందానని పదే పదే చెబుతూ వచ్చిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, ఇక్కడ ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గూటికే చేరిపోయారు.
బనగానిపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా జగన్ గూటికి చేరి, ఆ తర్వాత పరిస్థితు ల ప్రభావం వల్ల తిరిగి సొంత గూటికి చేరిపోయారు. చిత్తూరు జిల్లాలో తంబల్లపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అక్కడ ఇమడలేక పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. అదే జిల్లాలో మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయ టపడ్డారు.
జగన్ సొంత జిల్లా అయిన కడపలోనూ అసంతృప్తులు చెలరేగుతున్నాయి. తొలి నుంచీ తాను జగన్ మనిషి నంటూ చెప్పుకుంటూ వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితులు కనిపించక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లి పోయారు. బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత కొద్ది కాలానికే తిరిగి జగ న్ శిబిరం నుంచి బయటపడి కాంగ్రెస్ పార్టీలోకి వెనుదిరి గారు. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సోమశేఖర్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కదిరిలో సైతం జొన్న రామయ్య వర్గం పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో రగులుతోంది.
నెల్లూరు జిల్లాలోనూ అసంతృప్తులకు కొదవ లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం వెంకటరమణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డికి మధ్య ప్రచ్చన యుద్ధం జరుగుతోంది. గోవర్ధన్రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటపడే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోనూ బాల చెన్నయ్య, రవికుమార్ వర్గీయుల మధ్య అసంతృప్తి రగులుకుంటోంది. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్యనాయుడుకు బాధ్యతలు అప్పగించడం పై ఎంపీ మేకపాటి బావ మరిది రాజశేఖర్రెడ్డి భగ్గుమంటున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం ఎమ్మె ల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీలో చేరికపై వైకాపా నేత గరటయ్య అసంతృప్తితో ఉన్నారు.
కనిగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముక్కు కాశిరెడ్డి వర్గానికి నరాల రమణారెడ్డి వర్గానికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మార్కా పూర్ నియోజకవర్గంలో సైతం అశోక్కుమార్రెడ్డి, విజయ కుమార్రెడ్డి వర్గాల మధ్య పొసగటం లేదు. సంతనూతలపాడు నియోజకవర్గం నేత మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముందే నిరసనలు వెలిబు చ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జిల్లాలో ఒక్క ఒంగోలులో తప్ప మిగిలిన అన్ని నియో జకవర్గాలలోనూ పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తి చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గం నుంచి బోళ్ల బ్రహ్మనాయుడు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును సత్తెనపల్లికి ఇన్చార్జిగా నియమించడం పట్ల అక్కడి స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. తెనాలి నియోజక వర్గానికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఇన్ఛార్జిగా నియమించడం పట్ల తొలినుంచి పార్టీలో ఉన్న వెంకట్రెడ్డి వర్గం భగ్గుమంటోంది. వినుకొండ నియోజకవర్గంలోనూ తొలినుంచీ పార్టీకి సేవలంది స్తూ వచ్చిన విష్ణును కాదని నన్నపనేని సుధకు పెత్త నం కట్టబెట్టడంపై విష్ణు వర్గీయులు భగ్గుమంటున్నారు.
కృష్ణా జిల్లాలో పరిస్థితి సజావుగా ఏమీ లేదు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావుపై కటారి ఈశ్వర్కుమార్ వర్గం రగిలిపోతోంది. విద్యుత్ ఛార్జీలపై రాష్ట్ర బంద్ సందర్భంగా మంగళవారం అన్ని ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బంద్ పాటిస్తుండగా, గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావుకు చెందిన సినిమా థియేటర్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాను ప్రదర్శిస్తుండడంపై కటారి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంద్ సందర్భంగా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సినిమా థియేటర్ ముందు కటారి వర్గీయులు ధర్నాకు దిగారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేశ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పార్టీకి అక్కడ తొలినుంచీ సేవలందిస్తూ వచ్చిన శ్రీనివాస్ వర్గం పార్టీకి రాజీనామా చేసి, అధిష్టానం తీరుపై పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ఎదుట దుమ్మెత్తిపోసింది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంకు సంబంధించి జ్యోతుల సీతారామ స్వామి వర్గం రాజీనామా చేసింది. రాజమండ్రి రూరల్లోనూ ఆకుల వీరరాజును పార్టీలోకి చేర్చుకుని పెత్తనం అప్పగించడంపై తొలి నుంచీ పార్టీకి సేవలందిస్తూ వచ్చిన స్వామినాయుడు వర్గం భగ్గుమంటోంది. వీరరాజుకు పార్టీ టికెట్ ఇస్తే ఎన్నికలలో అతనిని ఓడించడమే తమ ధ్యేయమంటూ మాజీ ఎంపీ రాజబాబు అనుచరులు, స్వా మినాయుడు అనుచరులు బాహాటంగానే ప్రకటించారు.
తెలంగాణ జిల్లాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కుమ్ములాటలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా నేత రమణారెడ్డి పార్టీ కార్యాలయంలోనే అధిష్టానం తీరుపై నిప్పులు చెరిగి రాజీనామా పత్రాన్ని సుబ్బారెడ్డి ముఖాన విసిరికొట్టారు. ఈ విధంగా అసంతృప్తితో ఉన్న వివిధ జిల్లాలకు చెందిన కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయం వద్ద అధిష్టా నం వెఖరిపై నిరసనలు, ధర్నాలు చేసే స్ధాయికి అసంతృప్తి పెరుగుతూ వస్తోంది.
సోమవారం మల్కాజిగిరి ప్రాంత నేత లు కార్యకర్తలు పార్టీ కార్యలయం ముందు ధర్నాచేశారు. అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లానేతలు పార్టీ వైఖరిపై భగ్గుమన్నారు. మామిడాల వెంకటేశ్, అత్తిలి రామస్వామి తదితర నేతలు అధిష్టానం వైఖరిన తీవ్రంగా నిరశించారు.