ధిక్కారమున్ సైతునా: ఎల్వీపై మంత్రి సిఆర్ ఫైర్
ఈ వివాదానికి సంబంధించిన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి - తిరుమల-తిరుపతి దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయని శాసనసభ పిటిషన్స్ కమిటీకి ఓ ఫిర్యాదు అందింది. ఈ పిటిషన్ను పరిశీలించి ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పిటిషన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనల ప్రకారం శాసనసభ ఏదైనా సమాచారం కోరితే సంబంధిత మంత్రి కార్యదర్శి దానికి బాధ్యత తీసుకోవాలి.
పిటిషన్స్ కమిటీ రాసిన లేఖ కూడా మంత్రి రామచంద్రయ్యకు, అక్కడి నుంచి దేవాదాయశాఖ వ్యవహారాలు చూస్తున్న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎంజే గోపాల్కు వెళ్లింది. శాసనసభ కమిటీ నుంచి వచ్చిన ఈ పిటిషన్పై విచారణ జరిపి తనకు నివేదిక పంపాలని ఎంజే గోపాల్ టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు.
ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సమాధానాలు రాస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం మంత్రి రామచంద్రయ్య ప్రస్తావన కూడా తేవాల్సి వచ్చినట్లు తెలిసింది. ఈ సమాధానం మంత్రి కార్యదర్శి ద్వారా మళ్లీ పిటిషన్స్ కమిటీకి వెళ్లాలి. అలా వెళితే మంత్రి నుంచి తనకు సమస్యలు వస్తాయని భావించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం నేరుగా పిటిషన్స్ కమిటీకి పంపేశారు. ఇది తెలుసుకున్న మంత్రి రామచంద్రయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.