హోం కోసం దామోదర లాబీయింగ్: కిరణ్ విముఖత

ఉప ముఖ్యమంత్రి చేతిలో హోం శాఖ ఉండడం సంప్రదాయం. అయితే, అది నిబంధనేమీ కాదు. ఈ స్థితిలో దామోదర రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా నియమించినప్పటికీ హోం శాఖను మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి వద్దనే ఉంచారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ సబితా ఇంద్రారెడ్డి పేరను సిబిఐ నిందితురాలిగా చేర్చింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ స్థితిలో హోంశాఖ కోసం తీవ్రంగా పోటీ పెరిగింది.
దామోదర రాజనర్సింహ హోంశాఖను ఆశిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఆయనకు ఆ శాఖను కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరు. హోంశాఖ సబితా ఇంద్రారెడ్డి వద్ద ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ మాత్రం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. ఈ స్థితిలో హోం మంత్రి ముఖ్యమంత్రితో సఖ్యంగా ఉండాల్సి వస్తుంది. దామోదర రాజనర్సింహతో ముఖ్యమంత్రికి సత్సంబంధాలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్ల దామోదర రాజనర్సింహకు హోంశాఖను అప్పగించేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు.
తనకు విధేయంగా ఉండే మంత్రికే కిరణ్ కుమార్ రెడ్డి హోంశాఖను అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. సునీతా లక్ష్మారెడ్డికి హోంశాఖను అప్పగించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హోంశాఖ మహిళా మంత్రి చేతులోనే ఉన్నందున దాన్ని మరో మహిళా మంత్రికి అప్పజెప్పడమే సమంజసమని ముఖ్యమంత్రి అధిష్టానానికి చెబుతున్నట్లు సమాచారం.
కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఆజాద్తో చర్చించి ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో హోంశాఖ విషయం తేల్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications