జైలులో జగన్: ఓ వైపు భారతి, మరో వైపు విజయమ్మ

వైయస్ జగన్మోహన్ రెడ్డి జనంలో ఉంటే రాజకీయ ఉనికి ప్రశ్నార్ధమవుతుందనే భయంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై సిబిఐని పావులా వాడుకుంటూ ఏడాది కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భంధించారని ఆరోపిస్తూ ఈ తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాకు తరలి రావాలని వైఎస్ భారతి పిలుపునిచ్చారు.
మే 27 తేది సోమవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన కార్యక్రమంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జగన్కు బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు ఒక్కో కొవ్వొత్తితో తరలిరావాలని ఆమె అభిమానులనుకోరారు.
జగన్ నిర్బంధానికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మే 28 తేదిన హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనున్నారు. 28 తేది మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షను విజయమ్మ కొనసాగిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలిపింది.
అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్ను సిబిఐ అధికారులు మే 27వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం కుమ్మక్కయి సిబిఐని పావుగా వాడుకుని జగన్ను అరెస్టు చేయించాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications