మింగుడుపడని సర్వే: కెసిఆర్, జగన్కి 'ఆపరేషన్' చిక్కు
కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి జగన్, కెసిఆర్లు టిక్కెట్ పైన హామీలు ఇస్తున్నారట. దీంతో ఎప్పటి నుండో పార్టీ కోసం పని స్తూ టిక్కెట్ ఆశిస్తున్న ఆయా నియోజకవర్గాల నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. కొద్దికాలంగా జగన్ పార్టీలో కొత్త నీటి చేరికతో పాతవారిలో అసంతృప్తి కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెరాసలోను క్రమంగా అది కనిపిస్తోందని, ఎన్నికల నాటికి ఇది మరింత ఎక్కువయ్యే అవకాశముందని అంటున్నారు.
తమ టిక్కెట్ ఆశలపై కెసిఆర్ నీళ్లు చల్లడంతో ఇటీవల ఇద్దరు ముగ్గురు నేతలు తెరాస నుండి బయటకు వచ్చారు. మెదక్ జిల్లాకు చెందిన రఘునందన రావు సూటిగానే ఈ విషయం ప్రశ్నించారు. తాము మొదటి నుండి పార్టీ కోసం పని చేస్తున్నామని, అలాంటి తమ వంటి వారు టిక్కెట్ను ఆశిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇటీవలే ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. మాజీ ఎంపిలు చాడ సురేష్ రెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య ఇతర పార్టీలో చేరుతున్నారు.
తాము ఎప్పటి నుండి పార్టీ కోసం పని చేస్తుంటే నిన్నగాక మొన్న వచ్చిన గంగుల కమలాకర్, కడియం శ్రీహరి లాంటి తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెసు ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వడంపై కూడా తెరాసలో అసంతృప్తి సెగ రాజుకున్నట్లుగా సమాచారం. రఘునందన రావు, రుమాండ్ల రామచంద్రయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి.. ఇలా పలువురు నేతలు పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డవారికి ప్రాధాన్యం లేకపోవడం వల్లనే వారు పార్టీని వీడారని, కెసిఆర్ ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయత్నాలు చేస్తున్నారని, అదే జరిగింతే ఇంకొంత మంది నేతలు వస్తే మరికొంతమంది తెరాస ఆశావహులు ఇతర పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
ఇక జగన్ పార్టీలోను ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నారు. ఈ పాత వింత జోరు ప్రారంభమైంది మొదట వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే అంటున్నారు. ఇటీవలి వరకు జగన్ పార్టీలో రోజుకో జిల్లాలో విభేదాలు బయటపడ్డాయి. ప్రకాశం, నిజామాబాద్, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో కొత్త చేరికలపై పాతవారు అసంతృప్తులు వ్యక్తం చేశారు. జగన్ పార్టీ కూడా టిడిపి, కాంగ్రెసులలోని మరికొంత మంది ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందట. తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు సర్వేలను చూపించి కూడా ఆయా పార్టీల ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయట.