మొదటి రోజే జగన్ పార్టీ, మంత్రి పితాని కోడ్ ఉల్లంఘన
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదట కేసు వరంగలర్ జిల్లా మరిపెడ పోలీసు స్టేషన్లో నమోదయింది. విజయమ్మ బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో మరిపెడ మండల కార్యాలయం ఆవరణలోని మైదానంలో సభను నిర్వహించారు. మరిపెడ ఎంపిడివో ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఏడుగురు నేతల పైన కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది.
పార్టీకి చెందిన ఓ నేత జూన్ 28న సభ నిర్వహించుకోవడానికి అనుమతిని పొందారు. అయితే బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ పంచాయతీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయండతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయ మైదానం ఉపయోగించుకోవద్దని ఎంపిడివో నోటీసు పంపారు. అయితే వారు మాత్రం సభను నిర్వహించారు.
మంత్రుల ఉల్లంఘన
మంత్రులు పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యే డి.వై.దాసులు కూడా గీత దాటారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలో రెండు పాఠశాల భవనాలను పితాని బుధవారం సాయంత్రం ప్రారంభించారు. గుమ్ములూరులో జడ్పీ హైస్కూల్ అదనపు తరగతి భవనాన్ని, పెదపేటలో ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రాంరెడ్డి వెంకట రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీబిజీగా పాల్గొన్నారు. ఆయన బుద్దారంలో ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకుని, భోజనం చేస్తుండగా.. కోడ్ విషయం తెలిసింది. అప్పటికి ఇంకా పలు తండాల్లో కార్యక్రమాలు మిగిలే ఉన్నాయి. భోజనం తర్వాత ప్రజల నుంచి వినతులు స్వీకరించి, భైరవునిపల్లి, మంగాపురం తండాల్లో అభిృద్ధి పనుల్లో పాల్గొన్నారు. తాను కోడ్ను గౌరవిస్తూ వేరే వారితో కార్యక్రమాలు చేయించినట్లు మంత్రి చెప్పారు.
కోడ్ అమలులోకి వచ్చిన కొన్ని గంటలకే కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే డివై దాసు పలు ప్రారంభోత్సవాలు చేశారు. పామర్రు వ్యవసాయ మార్కెట్ యార్డులో అంతర్గత రహదారులు, గోదాములను ప్రారంభించారు. అలాగే పిహెచ్సి కొత్త భవనాలకు భూమిపూజ చేశారు.
సమైక్య సభకు కోడ్ అడ్డంకి?
కాగా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న భరోసా కల్పించడం కోసం సభ పెట్టాలనుకున్న సీమాంధ్ర నేతలకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. సీమాంధ్రలో బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇప్పట్లో ఉపయోగపడుతుందా లేదా అనే సంశయం సీమాంధ్ర నేతలను వెంటాడుతోంది. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు అధిష్ఠానం ఆమోదం ఇవ్వడమే దీనికి నిదర్శనమని ప్రజలకు హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తుందా.. రాదా? అనే అంశంపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు.