మమ్మల్ని ఆపలేరు, జైలు, వసూళ్ల పార్టీలొద్దు: బాబు
దేశాన్ని నడిపించే శక్తి యువతకే ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిరూపించుకుంటే ఆ తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. రాబోయే రోజులు పార్టీలకే కాకుండా ప్రజలకూ పరీక్షా కాలమేనన్నారు. కష్టపడే వారికి ఓట్లు వేస్తారా? జైల్లో ఉన్నవారిని ఆహ్వానిస్తారా? అవినీతి కాంగ్రెస్కి పట్టం కడతారా? వసూళ్ల పార్టీని నమ్ముతారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.
స్థానిక సంస్థలకు టిడిపి హయాంలోనే అధికారాలు, నిధులు అందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ నాశనం చేసిందని బాబు ఆరోపించారు. పంచాయతీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. ఇటీవల కేంద్రం స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చిందని, మన వాటాగా రూ. 4వేల కోట్లు రావాల్సి ఉండగా.. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ సొమ్ము రాకుండా పోయిందన్నారు. టిడిపి ఇసుక ఆదాయంపై పంచాయతీలకే హక్కు కల్పించిందన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఎమ్మెల్యేలే పెత్తనం చేస్తున్నారని, దాన్ని తాము ఆమోదించబోమని బాబు పేర్కొన్నారు. కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక పంచాయతీల వీధిదీపాల విద్యుత్తు వ్యయం భారీగా పెరిగిపోయిందన్నారు. రాష్ట్రానికి చెందిన 32 మంది ఎంపీలు, 13 మంది మంత్రులు ఢిల్లీలో సొంత పనులు చూసుకుంటున్నారే తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు.