నాడు జేసికి సవాల్ : నేడు ఉద్యోగానికి రాజీనామా !.. ఆ పార్టీలోకి ఎంట్రీ..?
అనంతపురం జిల్లాలో ఓ పోలీసు అధికారి. ఎంపి జేసి దివాకరరెడ్డికి మీసం తిప్పి సవాల్ చేసారు. ఆ తరువాత రాజకీయం గా ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఉద్యోగం వదిలి..రాజకీయాల పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసారని సమాచారం. ఇక, అధికారికంగా రాజకీయ ప్రవేశమే మిగిలింది..
ఎంపి జేసి దివాకర్ రెడ్డికి మీసం తిప్పీ
కొద్ది రోజుల క్రితం ఎంపి జేసి దివాకర్ రెడ్డికి మీసం తిప్పీ మరీ సవాల్ విసిరిన పోలీసు అధికారి గుర్తు ఉన్నారా. అనంత పు రం జిల్లా కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్. పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. జేసి దివాకర్ రెడ్డి పోలీసుల గురించి తక్కువ చేసి మాట్లాడిన సమయంలో మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ..తాను ఖాకీ డ్రస్ వదిలితే అంటూ...హెచ్చిరక జారీ చేసారు. అది అప్పట్లో పెద్ద వివాదాస్పదం అయింది.
పోలీసు యూనిఫాంలో
యూనిఫాంలో ఉన్న అధికారి ఆ విధంగా వ్యాఖ్యలు చేయకూడదని హోం మంత్రితో పాటుగా పోలీసు ఉన్నతాధికారులు సైతం తప్పు బట్టారు. దీని పై జేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు. పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తి తనకు హెచ్చరికలు చేస్తారా అనే నిలదీసారు. ఆ వ్యవహారం సర్దుమణుగుతున్న సమయంలో మాధవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ నిర్ణయం అనంత లో హాట్ టాపిక్ గా మారుతోంది.
శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను
అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించిన ట్లు సమాచార. 22 ఏళ్లుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్కు దూకుడు ఎక్కువనే పేరుంది. పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా.. జేసీ దివాకర్ రెడ్డికి సవాలు విసిరి మరోమారు వార్తల్లోకి వచ్చారు. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దీని పై మాధవ్ అధికారికంగా స్పందించలేదు. పోలీసు అధికారులు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. మాధవ్ రాజీనామా నిజమైతే..ఆయన వైసిపి లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.