తండ్రిలాగే..సమర్థుడు: వైఎస్ జగన్ను ఆకాశానికెత్తేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి: త్వరలో కలుస్తా
అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఛైర్మన్గా తన ఎన్నికను అడ్డుకుంటారని తాను భావించానని. అలా జరగలేదని అన్నారు. చివరి నిమిషం వరకూ ఫిరాయింపులను ప్రోత్సహించి, తమ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లను ఆకర్షించేలా వైఎస్సార్సీపీ కుట్ర పన్నుతుందని ఊహించానని చెప్పారు. అలాంటి ప్రయత్నాలేవీ వైఎస్ జగన్ చేయలేదని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం దిగజారలేదని అన్నారు. ఈ విషయంలో తన అంచనాలు తప్పు అయ్యాయని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రి మున్సిపాలిటీలో పాలక మండలిని ఏర్పాటు చేయడానికి టీడీపీ-వైసీపీ మధ్య రెండు ఓట్ల తేడా మాత్రమే ఉందని గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను వైసీపీ చేర్చుకోగలిగితే తాము చేయగలిగేదేమీ ఉండదని అన్నారు. అలాంటి ప్రయత్నం వైఎస్ జగన్ చేయలేదని చెప్పారు. ప్రజాభీష్ఠానికి అనుగుణంగా నడుచుకున్నారని చెప్పారు. ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలాగే.. జగన్ కూడా విలువలతో కూడిన రాజకీయం చేశారని ప్రశంసించారు.
వైఎస్ జగన్ నైతిక విలువలు ఉన్న నాయకుడని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన సహకారం లేకపోతే తాను చైర్మన్ అయ్యేవాడిని కానని స్పష్టం చేశారు. తాడిపత్రి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యతో కలసి పని చేస్తానని తేల్చి చెప్పారు. రాజకీయాల కంటే ప్రజాసేవే ముఖ్యమని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తామని, దాన్ని పక్కన పెట్టి, రాజకీయాలు చేయడం సరి కాదని జేసీ అన్నారు. త్వరలో ముఖ్యమంత్రిని మర్యాదపూరకంగా కలుస్తానని, తాడిపత్రిని అభివృద్ధి చేయడానికి సహకరించాలని కోరతానని చెప్పారు.
తాడిపత్రి మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరిన విషయం తెలిసిందే. మున్సిపల్ ఛైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ ఛైర్మన్ స్థానాన్ని కూడా టీడీపీనే గెలుచుకుంది. వైస్ ఛైర్ పర్సన్గా పీ సరస్వతి నియమితులయ్యారు. వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి సయ్యద్ భాషాకు 18 ఓట్లు పోల్ అవ్వగా.. టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డికి 21 ఓట్లు పడ్డాయి. పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20. ఆ సంఖ్యను టీడీపీ అందుకోవడం వల్ల టీడీపీ విజయం సాధించినట్లుగా ప్రిసైడింగ్ అధికారి మధుసూదన్ ప్రకటించారు.