కరివేపాకు కోసిస్తానని తీసుకెళ్ళి 11 ఏళ్ళ బాలికపై అత్యాచారం:ఆపై రాజీ యత్నం..ఏపీలో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి . దేశంలో బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏపీలో దిశ వంటి కఠిన చట్టాన్ని తీసుకు వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.
కరివేపాకు కోసిస్తానని పొలం తీసుకెళ్ళి బాలికపై లైంగిక దాడి
తాజాగా ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మృగాడు. వెలిగండ్ల మండలం కంకణపాడు గ్రామానికి చెందిన 47 ఏళ్ళ ఒక వ్యక్తి పదకొండేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తల్లి ఇంట్లో లేని సమయంలో బండి పై చిన్నారిని పొలం దగ్గరకు తీసుకువెళ్ళాడు. కరివేపాకు కోసి ఇస్తానని చెప్పి బాలికను తీసుకు వెళ్లిన కామాంధుడు ఆమెపై ఎవరూ లేని ప్రదేశంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు . అయితే బాలిక ఇంట్లో ఈ విషయాన్ని చెప్పలేదు అనుకున్న సదరు వ్యక్తి బాలికను తిరిగి ఇంటి దగ్గర దించేశాడు.
బాలికపై అత్యాచారం .. రాజీ కుదిర్చే యత్నం చేసిన గ్రామ పెద్దలు
అయితే ఇంటికి వచ్చిన బాలిక ఏడుస్తుండడంతో తల్లి ఏం జరిగిందని బాలికను ఆరా తీసింది. దీంతో బాలిక తల్లికి విషయం చెప్పింది. బాలిక ది, నిందితుడికి ఒకే సామాజిక వర్గం కావడంతో గ్రామ పెద్దలు బాలికపై పాశవికంగా దాడి చేసిన కామాంధుడిని కాపాడే ప్రయత్నం చేశారు. రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు చేసిన పెద్ద మనుషులు బాలిక తల్లికి కొంత డబ్బు పరిహారంగా ఇచ్చేలా ప్రయత్నం చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే బాలిక భవిష్యత్ పాడవుతుందని చెప్పి బాలిక తల్లిని ఒప్పించే ప్రయత్నం చేశారు .
Recommended Video
పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు .. నిందితుడి అరెస్ట్
అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రాజీ ప్రయత్నాలు చేసిన పెద్దమనుషులను పోలీసులు మందలించారు. ఇంకోసారి ఇలాంటి వ్యవహారాలు నడిపితే కేసులు పెడతామని హెచ్చరించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.ఒక పక్క దేశంలో హత్రాస్ ఘటనతో దేశ వ్యాప్తంగా మొదలైన కోపోద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఇదే సమయంలో చాలా రాష్ట్రాలలో నిత్యం బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారటం సమాజాన్ని ఆలోచించేలా చేస్తుంది . ప్రభుత్వాల అసమర్ధతను ప్రశ్నిస్తుంది .