బాబోయ్ ఎంత పొడుగో!.. శ్రీవారి సన్నిధిలో అరుదైన దృశ్యం
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం నాడు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. తిరుమలలో ఏడు అడుగుల ఎత్తైన మహిళ సందడి చేసింది. శ్రీలంకకు చెందిన మాజీ అంతర్జాతీయ నెట్బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం శ్రీవారిని దర్శించుకోవడం భక్తులలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తులను ఆశ్యర్యపరిచిన ఆమె ఎత్తు!
సుమారు ఏడడుగుల ఎత్తు ఉన్న తర్జిని శివలింగం ఆలయ ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెను చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంత పొడవైన మహిళను చూడటం అరుదు కావడంతో భక్తులు, స్థానికులు ఆమెను ఆసక్తిగా తిలకించడానికి, ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

రామానుజ జీయర్ స్వామితో కలిసి దర్శనం
తర్జిని శివలింగం ఒంటరిగా కాకుండా ఆధ్యాత్మిక గురువు, వానమామలై పీఠాధిపతి అయిన రామానుజ జీయర్ స్వామితో పాటు ఆయన భక్త బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా కలిసి సోమవారం ఉదయం శ్రీవారి ఆశీస్సులు పొందినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలు నిర్వహించబడ్డాయి.
తర్జిని శివలింగం క్రీడా నేపథ్యం
తర్జిని శివలింగం క్రీడా నేపథ్యం తెలుసుకున్న భక్తులు ఆమెను మరింత ఆసక్తిగా చూశారు. తర్జిని శివలింగం శ్రీలంక జాతీయ నెట్బాల్ జట్టులో కీలకమైన స్థానాన్ని పోషించారు. తన అద్భుతమైన ఎత్తు, ఆట నైపుణ్యంతో జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. ఆమె దేశం తరఫున ఆసియా నెట్బాల్ ఛాంపియన్షిప్లలో పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో శ్రీలంకకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టారు. శ్రీవారి దర్శనం కోసం ఆమె విదేశాల నుంచి ప్రత్యేకంగా తిరుమలకు రావడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. తన ఎత్తుతో దృష్టిని ఆకర్షించిన తర్జిని శివలింగం శ్రీవారి ఆశీస్సులు తీసుకుని తిరుగు పయనమయ్యారు.
తిరుమలలో స్పెషల్ అట్రాక్షన్!
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) November 3, 2025
శ్రీలంకకు చెందిన 7 అడుగుల ఎత్తైన నెట్బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగం (Tharjini Sivlingam) సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వానమామలై పీఠాధిపతి భక్త బృందంతో కలిసి వచ్చిన తర్జినిని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.#Tirupati #TharjiniSivlingam pic.twitter.com/fDAOxeUvgF












Click it and Unblock the Notifications