వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్ల వద్ద అదనపు ఏర్పాట్లు
వేసవి సెలవులు ముగిస్తుండటంతో పాటు రెండో శనివారం, ఆదివారం తోడవ్వడంతో తిరుమలకు భక్తులు గత మూడు రోజుల నుండి పోటెత్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి షెడ్ల బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పర్యవేక్షిస్తోన్నారు.
క్యూలైన్లలో 29 పాయింట్లలో భక్తులకు అన్న ప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తున్నారు. ఒక్కో పాయింట్ దగ్గర నలుగురు మంది శ్రీవారి సేవకులు టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ సాగుతోంది. 37 పాయింట్లలో తాగునీటి కుళాయిలను ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ఇవి బాట గంగమ్మ వద్ద గల 69వ గేట్ నుండి నారాయణ గిరి షెడ్ల వద్ద ఉన్న సర్వీస్ లైన్ గేట్ నంబర్ 1 వరకు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లలో 49 పాయింట్లలో త్రాగునీటి డ్రమ్ములు ఏర్పాటు చేసి ఒక్కో డ్రమ్ము వద్ద ఇద్దరు సేవకులను విధి నిర్వహణలో ఉంచారు. నిమిషాల వ్యవధిలో చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోన్నారు.
బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వరకు మరో 29 బ్లాకులను ఏర్పాటు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో బ్లాకులో 150 మంది భక్తులు వేచి ఉండొచ్చు. ఇక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు, అదనపు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఒక్కో బ్లాక్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుతో పాటు ఇద్దరు శ్రీవారి సేవకులు విధులు నిర్వహిస్తున్నారు.
గత మూడు రోజుల్లో 2,42,894 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. శనివారం 92,830 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా, స్వామివారి కైంకర్యాల నేపథ్యంలో దర్శన సమయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో అత్యధిక సంఖ్యలో శుక్రవారం 74,636 మంది భక్తులు, గురువారం 75,428 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్న అయిదు పీఏసీల్లో భక్తులు వసతి పొందేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
ఈ అయిదు చోట్ల కూడా దాదాపు 9,000 లాకర్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గత మూడు రోజుల్లో 1,34,637 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. క్షురకులు భక్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు.













Click it and Unblock the Notifications