జాతీయ క్రీడా పురస్కారాల లిస్ట్ వచ్చేసింది: తెలంగాణ నుంచి- తండ్రికి తగ్గ తనయ
దేశంలో అత్యున్నత క్రీడాకారులకు ఏటా అందించే నేషనల్ స్పోర్ట్స్ అవార్డుల జాబితా విడుదల అయింది. కొద్దిసేపటి కిందటే కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ దీన్ని విడుదల చేసింది. విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించింది. క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన అథ్లెట్లు, కోచ్ల కృషిని ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ఏటా అందజేస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఈప్రతిష్ఠాత్మక అవార్డులను ఖరారు చేసింది.
క్రీడా రంగంలో స్థిరంగా రాణిస్తూ అంతర్జాతీయ వేదికల భారత జెండాను రెపరెపలాడించిన అథ్లెట్లకు అర్జున అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రతినిధుల కమిటీ ఈ తుది జాబితాను సిద్ధం చేసింది. ఈ ఏడాది అర్జున అవార్డు గ్రహీతల జాబితాలో వివిధ రకాల క్రీడలకు సమాన ప్రాధాన్యత దక్కడం విశేషం.

బ్యాడ్మింటన్ లో తెలంగాణ నుంచి పుల్లెల గాయత్రి గోపీచంద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమెతో పాటు కేరళకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ ట్రీసా జాలీకి ఈ పురస్కారం దక్కింది. చెస్, షూటింగ్, పారా అథ్లెటిక్స్ విభాగాల నుంచి పలువురు యువ చాంపియన్లు ఈ జాబితాలో నిలిచారు. మహమ్మద్ అజ్మల్- అథ్లెటిక్స్, తేజస్విన్ శంకర్- అథ్లెటిక్స్, ప్రియాంక గోస్వామి- అథ్లెటిక్స్, త్రిషా జాలీ- బ్యాడ్మింటన్, పుల్లెల గాయత్రి గోపీచంద్- బ్యాడ్మింటన్, నరేందర్- బాక్సింగ్, విదిత్ సంతోష్ గుజరాతీ- చెస్.. అర్జున అవార్డులను దక్కించుకున్నారు.
వీరితో పాటు దివ్య జితేంద్ర దేశ్ముఖ్- చెస్, ధనుష్ శ్రీకాంత్- డెఫ్ షూటింగ్, లాల్రెమ్సియామి- హాకీ, రాజ్కుమార్ పాల్- హాకీ, సుర్జీత్- కబడ్డీ, పూజ- కబడ్డీ, రుద్రాన్ష్ ఖండేల్వాల్- పారా షూటింగ్, ఏక్తా భ్యాన్- పారా అథ్లెటిక్స్, అరవింద్ సింగ్- రోయింగ్, అఖిల్ షెరాన్- షూటింగ్.. అర్జున అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు.
ఫుట్బాల్ కు దశాబ్దాలుగా చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు లైఫ్టైమ్ పురస్కారానికి అరుమై నాయగం ఎంపికయ్యారు. క్రియాశీల క్రీడల నుంచి విరమించుకున్నప్పటికీ, యువతలో క్రీడలను ప్రోత్సహించేందుకు నిరంతరం కష్టపడే సీనియర్ క్రీడాకారులను గౌరవించడానికి ఈ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తారు.
అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని సగర్వంగా ఎగురవేయడానికి క్రీడాకారుల వెనుక ఉండి నడిపించే కోచ్ లకు కేంద్ర ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు గౌరవిస్తోన్న విషయం తెలిసిందే. ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన వారిలో పర్వీర్ సింగ్- అథ్లెటిక్స్, ఛోటే లాల్ యాదవ్- బాక్సింగ్, నేహా నందకుమార్ చవాన్- షూటింగ్ ఉన్నారు. వీరితో పాటు బాక్సింగ్ లో ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ లో వీరేందర్ కుమార్ కు ద్రోణాచార్య లైఫ్టైమ్ పురస్కారం లభించింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ విభాగంలో ఈ సారి పుణెలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్ ఎంపికయింది.














Click it and Unblock the Notifications