14 మంది సీఎంపై తీవ్రమైన కేసులు. సుప్రీంకోర్టు రిపోర్టుతో షాక్
దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులపై కేసులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలిపే ఒక సంచలన నివేదిక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ గత దశాబ్దకాలంగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా.. సీనియర్ న్యాయవాది, అమిస్క్యూరీ విజయ్ హన్సారియా ఆందోళనకరమైన గణాంకాలను న్యాయస్థానానికి సమర్పించారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారనే నిజం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.
రాష్ట్రాల్లో పాలకుల కేసుల చిట్టా!
ఈ నివేదిక ప్రకారం టాప్ ప్లేస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్కు చెందిన సువేందు అధికారిపై 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చెరో 19 కేసులు నమోదు కాగా, కేరళకు చెందిన వీడీ సతీశన్పై 18 కేసులు ఉన్నాయి. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరిలతో పాటు సిక్కిం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా కేసుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల పరంగా చూస్తే బెంగాల్లో అత్యధికంగా 58 శాతం మంది సభ్యులపై తీవ్రమైన కేసులు ఉండగా.. కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది శాసనసభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.

పార్లమెంట్లోనూ అదే తీరు!
కేవలం శాసనసభలకే పరిమితం కాకుండా పార్లమెంట్ సభ్యులపై కూడా భారీ స్థాయిలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. లోక్సభలోని మొత్తం 543 మంది సభ్యులలో 170 మంది (31 శాతం) పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీల్లో 11 మందిపై, కేరళలో 21 మందికి గాను 11 మందిపై, బీహార్లో 40 మందిలో 19 మందిపై, యూపీలో 80 మంది ఎంపీలలో 34 మందిపై కేసులు ఉన్నట్లు తేలింది. రాజ్యాంగ ఎగువ సభ అయిన రాజ్యసభలోనూ 233 మంది సభ్యుల్లో 75 మంది (33 శాతం) నేర చరిత్ర కలిగిన వారే కాగా, అందులో 40 మందిపై ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే తీవ్రమైన కేసులు ఉండటం గమనార్హం.
విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి!
దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై మొత్తం 4,192 క్రిమినల్ కేసులు కోర్టుల్లో విచారణ దశలో మగ్గుతున్నాయి. అందులో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 1,171 కేసులు పెండింగ్లో ఉన్నట్లు న్యాయవాది స్నేహా కలితా ద్వారా సమర్పించిన నివేదిక వెల్లడించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక కోర్టులను కేటాయించాలని, అలాగే ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఈ కేసుల విచారణ పురోగతిని నిశితంగా పర్యవేక్షించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని అమిస్క్యూరీ సుప్రీంకోర్టును కోరారు.














Click it and Unblock the Notifications