విజయ్పై విరుచుకుపడిన పత్రిక.. "సిగ్గులేకుండా సెల్యూట్" అంటూ
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు పాలిటిక్స్ కంటే ఎక్కువ సినిమా డ్రామాను తలపిస్తున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చెన్నై సెయింట్ జార్జ్ కోటలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషల కలయిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రొటోకాల్ను పక్కనబెట్టి ఒక హీరోయిన్కు ఫ్రంట్ రోలో సీటు కేటాయించడమే కాకుండా, వారిద్దరూ ఒకరికొకరు ప్రొఫెషనల్ సెల్యూట్లు చేసుకున్న తీరు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ వ్యవహారంపై డీఎంకే తన అధికారిక పత్రిక 'మురసోలి' వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
మర్యాదలు గాల్లో కలిసిపోయాయి!
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ ఈ రకమైన ప్రవర్తనతో పదవి మర్యాదను దిగజార్చారని మురసోలి తన సంపాదకీయంలో ఆరోపించింది. దేశానికి ఎంతో పవిత్రమైన స్వాతంత్ర్య దినోత్సవం రోజున, ప్రజాస్వామ్య వేదికపై ఎలాంటి సంకోచం లేకుండా ఒక నటికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్య ప్రియులను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది.

సీఎం విజయ్ కనీస సంకోచం కూడా లేకుండా ప్రవర్తించిన తీరును, ఆయనకు ఓటేసిన ప్రజలు కూడా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని డీఎంకే పత్రిక ఎద్దేవా చేసింది. విజయ్ తల్లిదండ్రుల పక్కనే పసుపు రంగు చీరలో మెరిసిన త్రిష కూర్చోవడం, జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో సెల్యూట్ చేయడం వైరల్గా మారింది.
గతంలోనూ వివాదాస్పద సన్నివేశాలు!
త్రిష అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షం కావడం ఇదే మొదటిసారి కాదు. గత మే నెలలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ ఆమె హాజరై భావోద్వేగానికి లోనవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయ్ వ్యక్తిగత జీవితంలో నెలకొన్న కుటుంబ సమస్యలు, ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్ వేసి ఇటీవల ఉపసంహరించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో.. విజయ్-త్రిషల బంధంపై వస్తున్న రూమర్లు ఈ సంఘటనతో మరింత ఊపందుకున్నాయి. ఈ వరుస పరిణామాలను డీఎంకే తీవ్ర రాజకీయ ఆయుధంగా మలుచుకుని విజయ్ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తోంది.
పాత పద్ధతులకే పరిమితమైన నేతలు!
ఇదిలా ఉంటే, త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఇటీవల అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ కక్షను మనసులో ఉంచుకునే డీఎంకే ఇప్పుడు ఈ రకమైన వ్యక్తిగత దాడికి దిగుతోందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ మాజీ నేత అన్నామలై స్పందిస్తూ.. నేటికీ కొందరు రాజకీయ నాయకులు తమ పాత పద్ధతులను వదులుకోలేకపోతున్నారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మహిళలను, కుటుంబ సభ్యులను మధ్యలోకి లాగడం అత్యంత హీనమైన చర్య అని, కాలం మారినా కొంతమంది రాజకీయ నేతల మనస్తత్వాలు మారలేదని ఆయన అభిప్రాయపడ్డారు.














Click it and Unblock the Notifications