అరసవల్లిలో అద్భుతం ఆవిష్కృతం.. సూర్య భగవానుడిని తాకిన సూర్య కిరణాలు..
ఏపీలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నోఉన్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి దేవాలయం ఒకటి. అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్క్రతమైంది. సూర్య కిరణాలు ఆలయంలో సూర్య భగవానుడి పాదాలను తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పునీతులయ్యారు. సూర్యుని లేలేత కిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి సూర్యభగవానుణ్ని తాకాయి. నేటి (మంగళవారం) ఉదయం 6.05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు.
ఈ అద్భుత ఘట్టం రేపు (బుధవారం) కూడా జరిగే అవకాశమున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం స్వామివారి మూలవిరాట్ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయ పండితులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు ఇలాంటి అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ప్రతిఏటా మార్చి 9, 10 తేదీల్లో, అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో మూల విరాట్ ను నేరుగా సూర్యకిరణాలు తాకుతాయి.

సూర్య భగవానుడి విగ్రహాంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో వారి జన్మధన్యమైందంటూ ఇక్కడికి వచ్చిన భక్తులు పులకించిపోతున్నారు. ఈ సందర్భంగా సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. సూర్యకిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. అందుకే చాలామంది ఈ సమయంలో ఇక్కడికి వస్తుంటారు. ఎప్పటినుంచో ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలనుకుంటున్నామని.. ఇప్పుడు ఆ ఆ దర్శన భాగ్యం తమకు కలుగడం సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications