రమ్మంటారు! దోచేస్తారు: ‘వ్యభిచార’ ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు
గత కొంత కాలంగా వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి కాకినాడ రెండప పట్టణ పీఎస్ సీఐ ఉమర్ వివరాలను తెలిపారు.
కాకినాడ: గత కొంత కాలంగా వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడ్ని కాకినాడ రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సీఐ ఉమర్ తెలిపిన వివరాలు.. కాకినాడ ప్రతాప్ నగర్ దుర్గమ్మగుడి సమీపంలో వంగలపూడి జ్యోత్స్న, వాడపల్లి గీతాదేవి అనే ఇద్దరు మహిళలు గత కొంతకాలంగా ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.
వాట్సప్లో చాటింగ్
ఈ ఇద్దరు వాట్సాప్లో కొంతకాలంగా కాకినాడ జగన్నాథపురానికి చెందిన యాళ్ల భవానీ శంకర్తో పాటు అతడి స్నేహితులు బోడా శేఖర్, వెంకట మహేష్లతో చాటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ముగ్గురినీ ప్రతాప్నగర్లోని ఇంటికి ఇద్దరు మహిళలు ఆహ్వానించారు. వారు తమ ద్విచక్రవాహనాలపై ఆదివారం అర్ధరాత్రి దాటాక వెళ్లారు. వెంటనే వారిని మహిళలు లోనికి ఆహ్వానించారు.
ప్లేట్ ఫిరాయిస్తారు..
కాగా, అప్పటికే ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. భవాని శంకర్తో పాటు అతడి స్నేహితులతో వాదులాటకు దిగారు. సంస్కారవంతులైన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారా? అంటూ వారిపై దాడికి పాల్పడి వారి వద్ద నుంచి పర్సు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలు లాక్కొని వారిని ఓ గదిలో బంధించారు.
తెల్లారేవరకు బంధీలుగా..
తెల్లవారే వరకు బంధీలుగా ఉన్న భవానిశంకర్ అతడి స్నేహితులకు అదే గదిలో మరో సెల్ఫోన్ లభ్యమైంది. ఆ ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి విడిపించారు. అనంతరం బాధితులు సోమవారం మధ్యాహ్నం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదుతో...
ఈ మేరకు వారి పిర్యాదు మేరకు ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలోని బృందం ప్రతాప్నగర్లోని మహిళల ఇంటికి చేరుకొని ఇద్దరు మహిళలతో పాటు వారికి సహకరిస్తున్న కాకినాడ రేచర్లపేటకు చెందిన ఎద్దు మీరాసాగర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మరో ఇద్దరు సహాయకులు దుర్గాప్రసాద్, దుర్గలు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు. నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు రెండువారాల రిమాండ్ విధించిందని చెప్పారు. అయితే, నిందితులు ఈ వ్యవహారం ఎంత కాలం నుంచి జరుపుతున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.