హైదరాబాద్ను ముంచెత్తిన వాన- ఈ జిల్లాల్లో ఇక కుండపోత, తాజా హెచ్చరిక..!!
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రేటర్ పరిధిలో రికార్డు వర్షపాతం నమోదు అయింది. పలు చోట్ల నీరు నిలిచిపోయింది. గ్రేటర్ అధికారులు ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దింపారు. కాగా, రానున్న రెండు రోజులు హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సముద్రమట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం బికనీర్, ఢిల్లీ, లక్నో, పాట్నా మీదుగా మణిపూర్ వైపు కొనసాగుతూ సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని, ఇది ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ, తమిళనాడు మీదుగా కొమెరిన్ వరకు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడిందని తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
కాగా, హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నల్లగొండ, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా సరూర్నగర్ ప్రాంతంలో 11.3 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దాని సమీపంలోని అలకాపురి కాలనీలో 10.9 సెం.మీ. వర్షం కురవగా, ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద 9.6 సెం.మీ. వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వివరించారు. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications