తీవ్ర ఒత్తడి?: నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య, నిరసనలు
చిత్తూరు: రేణిగుంట చెక్పోస్టు సమీపంలోని నారాయణ కళాశాలలో ఆదివారం రాత్రి కమలేష్ (16) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. చదువు విషయంలో అధ్యాపకుల ఒత్తిళ్ల కారణంగానే కమలేష్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వారు ఆరోపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరుకు చెందిన కమలేష్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు స్టడీ అవర్లో సహచర విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు.
ఆ తర్వాత హాస్టల్లోని తన గదికి వెళ్లిన కమలేష్ ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. యాజమాన్యం కమలేష్ను తిరుపతి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు.

అయితే ఈ ఘటనను బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థులు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపైకి చేరుకుని ధర్నాకు దిగారు.
వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కళాశాల యాజమాన్యం కమలేష్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ కమలేష్ కుటుంబసభ్యులు, బంధువులు సోమవారం ఉదయం ఆందోళన నిర్వహించారు.












Click it and Unblock the Notifications