ఏపీ లారీకి ప్రమాదం, ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి: రూ. 2కోట్ల విలువైన ఎర్రచందనం సీజ్
బీజూపూర్/కడప: రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను లారీలో తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీజాపూర్ వద్ద చెట్టుకు లారీ ఢీకొనడంతో అందులోని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరో ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.
ఓ కానిస్టేబుల్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో కానిస్టేబుల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనపై కడప ఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు తమ బృందాలు బయల్దేరాయని చెప్పారు.
రూ. 2కోట్ల విలువైన 68 ఎర్రచందనం దుంగల స్వాధీనం
చిత్తూరు: శేషాచలం అటవీ ప్రాంతంలో శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేటి మండపం వద్ద శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో వారికి సుమారు 70మంది ఎర్రచందనం కూలీలు ఎదురుపడ్డారు.
ప్రత్యేకదళం అధికారులు వారిని హెచ్చరించడంతో సదరు కూలీలు తాము తీసుకొస్తున్న ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు. వీరిలో తమిళనాడుకు చెందిన ఇద్దరు కూలీలను ప్రత్యేక కార్యదళం అదుపులోకి తీసుకుంది.
కూలీల నుంచి 68 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. టాస్క్ఫోర్స్ ఆర్.ఎస్.ఐ వాసు ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
తిరుపతి నుంచి అదనపు బలగాలు తరలించాలని కార్యదళం నిర్ణయించింది. ప్రస్తుతం శ్రీవారిమెట్టు, రంగంపేట, నర్సింగాపురం, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యదళం పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది.