బ్రహ్మోత్సవాల లోపు తిరుమలలో అత్యాధునికంగా అందుబాటులో
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 90,012 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,345 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.99 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 23 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
ఆ ఒక్క రోజే 4.50 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.71 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,254 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

కాగా.. తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం సరికొత్త హంగులతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ ఆధునికీకరణ పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. రానున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి ఈ మ్యూజియం అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులను ఆకట్టుకునేలా ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. గ్యాలరీల రూపకల్పనను సమీక్ష నిర్వహించారు. కళాఖండాల ప్రదర్శనకు సంబంధించిన గ్యాలరీలు చూడ్డానికి మాత్రమే కాకుండా భక్తుల మనసులలో భక్తిభావాన్ని నింపేలా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాలని స్పష్టం చేశారు. ప్రాచీన కళా సంపద వైభవాన్ని నేటి తరానికి వివరించేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
మ్యూజియానికి వచ్చే భక్తులు, యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనీస సౌకర్యాల కల్పనలో రాజీ పడకూడదని వెంకయ్య చౌదరి ఆదేశించారు. మ్యూజియం వెలుపల విశాలమైన పార్కింగ్ వసతిని కల్పించాలని సూచించారు. లోపలికి ప్రవేశించే భక్తులు తమ మొబైల్ ఫోన్లను భద్రంగా ఉంచుకోవడానికి ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లను తగిన సంఖ్యలో అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో కొండపైకి వచ్చే లక్షలాది మంది భక్తులందరూ కూడా మ్యూజియాన్ని సందర్శించే అవకాశం ఉందని, వారికి ఇబ్బంది కలగకుండా లైన్ల క్రమబద్ధీకరణ, మంచినీరు వంటి తక్షణ వసతులను సిద్ధం చేయాలని తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరమైన జ్ఞాపకాలను మిగిల్చేలా ఈ ప్రతిష్టాత్మక మ్యూజియాన్ని సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications