కారణం ఇదేనా?: పట్టపగలే లాయర్ని కత్తులతో నరికి చంపారు (ఫోటోలు)
అమరావతి: ఏలూరులో సోమవారం మధ్యాహ్నం ఓ షాపులో కూర్చొని ఉన్న లాయర్ రాయల్ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా నరికి చంపిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులు పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
లాయర్ హత్యోనందరం జిల్లా ఎస్పీ భాస్కరభూషణ్ ఆసుపత్రిలో ఉన్న రాయల్ మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్ద రోదిస్తున్న మృతుడి భార్య విజయను ఆయన పరామర్శించారు. మృతుడికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? గతంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా అనే విషయాలను ఆమెను అడిగారు.
అనంతరం ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించి ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావుతో మాట్లాడి పూర్తి వివరాలను తెలసుకున్నారు. ఈ సందర్భంగాఎస్పీ మాట్లాడుతూ హత్య కేసులో ఓ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని అతన్ని విచారిస్తున్నామన్నారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మరోవైపు ఈ హత్య ఘటనలో ఐదుగురు పాల్గొనగా షాపు యజమాని సాయంతో ఒక నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలే రద్దీగా ఉన్న ప్రాంతంలో న్యాయవాది హత్యకు గురైయ్యాడన్న వార్త వ్యాపించటంతో నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
సెటిల్మెంట్లే హత్యకు కారణమా ?
లాయర్ రాయల్ గతంలో కొన్ని వివాదాల్లో ఇరుపక్షాల వారితో మాట్లాడటం, రాజీ చేయటం వంటి వ్యవహారాలు చూసేవారని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
ఈ ల్యాండ్ సెటిల్మెంట్లో నష్టపోయిన వారే ప్రతీకారంగా ఈ హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసిన నిందితులను ఎవరైనా కిరాయికి కుదుర్చుకున్నారా లేదా నిందితులే నేరుగా ప్రతీకారం తీర్చుకునేందుకు రాయల్ను హతమర్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ఏలూరులో లాయర్ని కత్తులతో నరికి చంపిన దుండగులు
వన్టౌన్ సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం... ఏలూరు నగరం వన్టౌన్ ప్రాంతం పడమరవీధిలో నివాసముంటున్న పలివెల దత్తాత్రేయ రామానంద రాయల్ (40) న్యాయవాది. ఇతనికి భార్య విజయ, నాలుగేళ్ల హర్ష అనే కుమారుడున్నారు. సోమవారం మధ్యాహ్నం కెనాల్ రోడ్డులోని గాంధీ మున్సిపల్ స్కూల్ కాంప్లెక్స్లో ఉన్న శ్రీలక్ష్మీ గణపతి రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషర్ వర్క్స్ దుకాణానికి రాయల్ వెళ్లారు. అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లి కొంతసేపు కూర్చుని దుకాణ యజమానులతో మాట్లాడుతుంటడం అలవాటు. సోమవారం ఆయన వెళ్లే సమయానికి యజమానుల్లో ఒకరైన నరహరిశెట్టి భాస్కరరావు దుకాణంలో ఉన్నారు.

ఏలూరులో లాయర్ని కత్తులతో నరికి చంపిన దుండగులు
అతనితో మాట్లాడుతూ రాయల్ పేపరు చదువుతుండగా ఇద్దరు వ్యక్తులు ఓ సంచి తీసుకుని దుకాణంలోకి వచ్చారు. అందులో ఒకడు కూలర్లు బాగుచేస్తారా అని యజమానిని అడిగాడు. ఇప్పుడు కుదరదని అతను బదులిచ్చాడు. ఈలోగా బయట ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు లోనికి వచ్చారు. మొదట వచ్చిన ఇద్దరిలో ఓ వ్యక్తి ఈలోగా సంచి విప్పాడు. అందులోఉన్న కత్తులను క్షణాల్లో బయటకు తీశారు. ఇద్దరు వ్యక్తులు దుకాణ యజమాని వద్దకు వెళ్లి అతన్ని కదలకుండా నిర్బంధించారు.

ఏలూరులో లాయర్ని కత్తులతో నరికి చంపిన దుండగులు
మరో ఇద్దరు పక్కనే కూర్చున్న న్యాయవాది రాయల్పై కత్తులతో దాడి చేశారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. రాయల్ మెడ భాగంపై బలమైన గాయమైంది. చేతిపైన కూడా గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి అతను కొట్టు కొంటుండగా దుకాణంలో ఉన్న దుండగులు బయటకు పరారయ్యారు. ఈ సమయంలోనే ఓ దుండగుడు న్యాయవాది చనిపోయాడా లేదా అని చూస్తుండగా దుకాణం యజమాని బయటకు పరుగుతీసి నిందితుడు లోపల ఉండగానే బయట షట్టర్ మూశాడు.

ఏలూరులో లాయర్ని కత్తులతో నరికి చంపిన దుండగులు
వన్టౌన్ సీఐకు విషయం చెప్పగానే సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో వచ్చి దుకాణంలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులు కొంతకాలంగా రాయల్ కదలికలను గుర్తించి ఉంటారని భావిస్తున్నారు. ఘటన జరిగిన దుకాణం వద్దకు రాయల్ తరచూ వస్తుంటారు. అక్కడే కొన్ని వృత్తిపరమైన పనులు చేస్తుండేవారు. ఈ నేపథ్యంలోనే రాయల్ దుకాణానికి ఏ సమయంలో వస్తారు.

ఏలూరులో లాయర్ని కత్తులతో నరికి చంపిన దుండగులు
ఎంతసేపు ఉంటారు. అతనితో ఇంకా ఎవరైనా ఉంటారా అనే విషయాలను నిందితులు తెలుసుకున్నారు. ఘటనకు ముందు రెండు మూడు రోజులు వాళ్లు రెక్కీ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన నిందితుడిని సత్యనారాయణ పేటకు చెందిన గురజాల నవీన్గా పోలీసులు గుర్తించారు. అతన్ని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. నవీన్ సోదరుడు ప్రభు ఈ హత్య ఘటనలో ప్రధాన భూమిక పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ముగ్గురు నిందితులు ఎవరై ఉంటారు... ఏలూరుకు చెందిన వారేనా... ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications