ఢిల్లీలో సీఎం జగన్ - ప్రధాని సమావేశంలో : చంద్రబాబు మంతనాలతో..!!
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ చేరుకున్నారు. వైసీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించనున్నారు. 2019 జులై తర్వాత పాలకమండలి సభ్యులు భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి.

ప్రధానితో సీఎం జగన్ సమావేశం
పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అయితే, ప్రధానితో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలవరం నిర్వాసితుల అంశంతో పాటుగా ఆర్దిక అంశాల పైన ఆయన ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం జగన్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. గత వారమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే, పార్లమెంట్ సమావేశాలు.. ఉప రాష్ట్రపతి ఎన్నికల కారణంగా అప్పాయింట్ సాధ్యపడలేదని చెబుతున్నారు.

పీఎం - చంద్రబాబు భేటీ తరువాత
తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రం నిర్వహించిన ఆజాదీకా మహోత్సవ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని - చంద్రబాబు మధ్య చోటు చేసుకుకున్న పలకరింపులు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. చంద్రబాబు మరోసారి త్వరలోనే ప్రధానితో సమావేశం అయ్యేందుకు ఢిల్లీ వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సమావేశం కానుండటంతో...ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి. సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు ఇద్దరికీ రానున్న ఎన్నికలు కీలకం కానుండటంతో..ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇద్దరికీ ఇదే సమయంలో కేంద్రంలోని అధికారంలో ఉన్న ముఖ్య నేతలతో సత్సంబంధాలు కీలకం కానున్నాయి.

ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయం
2019 ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా మరోసారి పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో..సీఎం జగన్ కు కేంద్రం నుంచి పోలవరం నిధులు సాధించటం సవాల్ గా మారుతోంది. ప్రాజెక్టు నిర్వాసితులకు అందించాల్సిన ప్యాకీజి పెద్ద మొత్తం కావటంతో కేంద్రం సహకరిస్తే మినహా సాధ్యం కాదని సీఎం జగన్ ముంపు గ్రామాల వాసులకే తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు కేంద్రం సీఎం జగన్ అభ్యర్ధనల పై ఏ రకంగా స్పందిస్తుందీ.. రాజకీయంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏ రకమైన టర్న్ తీసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications