రాళ్లలో కూడా ఆడా, మగ ఉంటాయా..?
దేవాలయ విగ్రహం తయారీలో రాయి ఎంపిక సాధారణ నిర్మాణ పనిలా ఉండదు. శిల్పి చేతిలోకి వెళ్లే ముందు ఆ శిల ధ్వని, రంగు, బలం, లోపాలు అన్నీ పరీక్షిస్తారు. ఈ ప్రక్రియలోనే శిల్పశాస్త్రం చెప్పే పురుష శిల, స్త్రీ శిల, నపుంసక శిల అనే వర్గీకరణ వస్తుంది. ఇక్కడ 'ఆడ రాయి’, 'మగ రాయి’ అన్న మాటలు జీవుల లింగభేదాన్ని సూచించవు. అవి శిల స్వభావాన్ని వివరించే సాంకేతిక పదాలు. రాయిని తట్టినప్పుడు వచ్చే నాదం, దాని గట్టితనం, అంతర్గత నిర్మాణం ఆధారంగా శిల్పులు దాని వినియోగాన్ని నిర్ణయిస్తారు.
విగ్రహాల కోసం శిలను ఎలా గుర్తిస్తారు?
శిలను తట్టినప్పుడు కంచు గంటలా గంభీరంగా, ఎక్కువసేపు వినిపించే నాదం వస్తే దాన్ని పురుష శిలగా పరిగణిస్తారు. సంప్రదాయం ప్రకారం ఇలాంటి రాళ్లతో విష్ణువు, రాముడు, ఆంజనేయస్వామి వంటి పురుష దేవతల విగ్రహాలను చెక్కేందుకు అనుకూలంగా భావిస్తారు. ఇత్తడి గంట మోగినట్టు మృదువైన, స్పష్టమైన ధ్వని వస్తే దాన్ని స్త్రీ శిలగా గుర్తిస్తారు. సీతాదేవి, మహాలక్ష్మి, ఆండాళ్ వంటి దేవతామూర్తుల విగ్రహాలకు ఈ రకమైన శిలలు ఉపయోగిస్తారు. నిస్సారంగా, డప్పు మోగినట్టు శబ్దం వస్తే దాన్ని నపుంసక శిలగా చెబుతారు.

నపుంసక శిలలు సాధారణంగా ప్రధాన విగ్రహాల తయారీకి తీసుకోరు. అయితే ఆలయ పీఠాలు, ఆధార నిర్మాణాలు, నేల భాగాలు వంటి పనుల్లో వినియోగిస్తారు. అంటే ఈ వర్గీకరణ రాయిని తిరస్కరించడానికే కాదు, దానికి సరైన ఉపయోగాన్ని నిర్ణయించడానికీ ఉపయోగపడుతుంది. దేవాలయ విగ్రహానికి ఎంపిక చేసే రాయి ఏకవర్ణంగా ఉండాలి. నల్ల శిల అయితే రంగులో మచ్చలు, తెల్ల చారలు, పొరలు కనిపించకూడదు. శిలను నీటితో కడిగి లోపలి పగుళ్లు, సన్నని రేఖలు ఉన్నాయా అని పరిశీలిస్తారు.
చిన్న పగులు ఉన్నా అలాంటి రాయిని విగ్రహానికి వాడకపోవడం వెనుక ఆచార కారణంతో పాటు ప్రాయోగిక కారణం కూడా ఉంది. అభిషేకాల సమయంలో నీరు లోపలికి చేరితే కాలక్రమంలో విగ్రహం బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే శిల ఎంపికలో శిల్పులు చాలా కఠినంగా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం నాణ్యమైన కృష్ణశిలలు అన్ని ప్రాంతాల్లో సులభంగా దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరిమితంగా లభిస్తుండగా, తమిళనాడులోని కంచిపురం, తిరుచ్చి పరిసర ప్రాంతాల క్వారీల నుంచి శిలలు ఎక్కువగా సేకరిస్తున్నారు. ఒక విగ్రహం వెనుక కళ మాత్రమే కాదు, శాస్త్రం, అనుభవం, సంప్రదాయం కలిసి ఉంటాయని ఈ ప్రక్రియ చూపిస్తుంది.












Click it and Unblock the Notifications