పవన్.. బాబుకు పెయిడ్ ఆర్టిస్టువా?: అంబటి, పతివ్రతలు లేరన్న జూపూడీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్కి తెలిసినట్టు లేదని అన్నారు.
రైతుల భూసేకరణపై పోరాడతానన్న పవన్.. ఇప్పుడేం చేస్తున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబునాయుడికి పెయిడ్ ఆర్టిస్టులా వ్యవహరించొద్దని పవన్ కళ్యాణ్కు సూచించారు. ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో సంభాషిస్తూ దొరికిపోయిన చంద్రబాబునాయుడు, ఏసీబీ నోటిసులిస్తుందనే భయంతోనే జిల్లాల్లో పర్యటన చేపట్టినట్లు అంబటి రాంబాబు విమర్శించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులో సంభాషణలు చంద్రబాబువా? కాదా?అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఇచ్చిన రూ.50 లక్షల ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు.
చంద్రబాబూ.. రేవంత్ రెడ్డి బాస్ నువ్వా? కాదా? అని విషయం కూడా ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టిన తర్వాతే సెక్షన్-8 గుర్తుకొచ్చిందా? అని అంబటి నిలదీశారు.

రాజకీయ పతివ్రతలు లేరు: జూపూడి
విజయవాడ: రాజకీయాల్లో పతివ్రతలు ఎవ్వరూ లేరని తెలుగుదేశం ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. ఆయన ఆదివారం విజయవాడలో ఓటుకు నోటు వ్యవహారంపై టిడిపి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయాల్లో పతివ్రతలు ఎవరున్నారని అడిగారు.
డబ్బు ఇవ్వకుండా ఎవరైనా ఎన్నికల్లో గెలిచారా ? అంటూ జూపూడి వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల్లో ఓటర్లును డబ్బుతో ప్రలోభపెట్టడాన్ని సమర్థిస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. జూపూడి నుంచి సమాధానం రాలేదు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉందనీ, ప్రస్తుతం కెసిఆర్ కుటుంబంలో సిఎం ఎవరనే చర్చనే సాగుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications