మంత్రి హరీష్ రావుకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు సవాల్..!
తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రుల కౌంటర్ కొనసాగుతోంది. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యల పైన స్పందించారు. ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు -అర్హత తెలంగాణ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు. తమ రాష్ట్రంలో బలహీన పడి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై చర్చకు హరీష్ రావు సిద్ధమా అంటూ హరీష్ కు అంబటి సవాల్ చేసారు.

కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్ర
ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర - చంద్రాబాబు పైన మంత్రి అంబటి సీరియస్ వ్యాఖ్యలు చేసారు. అమరావతి మహా పాదయాత్ర రైతుల పాదయాత్ర కాదని.. ఒళ్ళు బలిసిన వాళ్ళు చేస్తున్న పాదయాత్ర అని చెప్పానన్నారు. ఇప్పుడు మరోసారి అదే చెబుతున్నానని స్పష్టం చేసారు. కొవ్వు ఎక్కిన కోటీశ్వరుల పాదయాత్రగా అంబటి సీరియస్ వ్యాఖ్యలు చేసారు. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలని హెచ్చరించారు.

మూల్యం చెల్లించుకోక తప్పదంటూ
యాక్షన్ కు రియక్షన్ ఉంటుందని..చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని అంబటి తేల్చి చెప్పారు. పోలవరం సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు కోరికగా అంబటి పేర్కొన్నారు. రాష్ట్రం శ్రీలంకలా అయిపోవాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏమైనా.. తమ తాబేదార్లు ఉన్న అమరావతి మాత్రం దేదీప్యమానంగా వెలిగి పోవాలనేది చంద్రబాబు ఆలోచన అంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేయలేక పోతున్నారని ప్రశ్నించారు.

కుప్పంలో ఓటమి ఖాయం
ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదా అని నిలదీసారు. భద్రాచలమే మునిగి పోతుందని తెలంగాణ చేసిన వాదన కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో వారసత్వం ఉండదని అంబటి వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు లేకుండా కేవలం వారసత్వంతోనే రాజకీయాల్లో రాణిస్తాం అనుకుంటే పొరపాటని..లోకేష్ పరిస్థితే దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. అందుకే లోకేష్ ను చంద్రబాబు దొడ్డి దారిన మంత్రిని చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కుప్పంలో ఓటమి ఖాయమంటూ మంత్రి అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications