కోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ వకీల్ సాబ్ అవుతారా.. గెడ్డం పెంచిన ప్రతీ ఒక్కరూ సాధువు అవుతారా : అంబటి
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఒక ఐరన్ లెగ్ అని... ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ మటాశ్ అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేశ్ జగన్ ఎడమ కాలి గోటితో సమానమని విమర్శించారు. రాష్ట్రంలో పచ్చజెండా పుచ్చిపోయిందని... ఆ జెండా పట్టుకునేందుకు కార్యకర్తలే కరువయ్యారని విమర్శించారు. కుప్పంలోనే మీకు దిక్కు లేదు... ఇక తిరుపతిలో ఏదో చేస్తారని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. స్థాయి లేకపోయినా విమర్శలు చేస్తే గౌరవం ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారంటూ బీజేపీ చేసిన విమర్శలకు అంబటి కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు : అంబటి
సీఎం జగన్ స్వరూపానందను కలిసినా, రమణ దీక్షితులు సీఎం గురించి మాట్లాడినా టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. భగవంతుడి స్వరూపంలో జగన్మోహన్ రెడ్డి మేలు చేశారని రమణ దీక్షితులు మాట్లాడితే... దానిపై చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. స్వామిజీలు,టీటీడీలో పనిచేస్తున్న ధర్మకర్తలు జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు పొగడుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నవారు గనుక పొగడుతున్నారని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు గనుక పొగడుతున్నారు.

కోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ వకీల్ అవుతారా? : అంబటి
గతంలో తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ,పవన్,చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ముందు దాని గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. గతంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మళ్లీ వారితోనే జతకట్టారని విమర్శించారు. ఇక బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దియోధర్ పవన్ కల్యాణ్ సినిమాను ప్రమోట్ చేయడానికి వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. పవన్ సినిమా టికెట్లు కొనండి అనే స్థాయికి టీడీపీ ఎందుకు దిగజారింది అని ప్రశ్నించారు. టికెట్లు కొని సినిమా చూడమనే హక్కు మీకు ఉంటే ఉండవచ్చు గానీ తిరుపతిలో ఓటు అడిగే హక్కు బీజేపీ,జనసేనలకు లేదని అంబటి అన్నారు. 'వకీల్ సాబ్'ను చూసి భయపడుతున్నారని బీజేపీ విమర్శిస్తోందని... కోటు వేసుకున్న ప్రతీవారు వకీలు అవుతారా... గడ్డం పెంచిన ప్రతీ ఒక్కరూ సాధువు అవుతారా అని ప్రశ్నించారు.

ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి...
చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడమే తప్పితే ఎన్నడూ స్వశక్తితో అధికారంలోకి రాలేదన్నారు. తిరుపతి ప్రజలు ఈసారి కూడా జగన్ని ఆశీర్వదించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వివేకా హత్యపై మాట్లాడుతున్న టీడీపీ,పవన్,బీజేపీ... దానిపై ఏమైనా అడగదలుచుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీని అడగాలన్నారు. సీబీఐ కేంద్ర హోంమంత్రి ఆధీనంలో పనిచేస్తుందని తెలిపారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరగడం సహజమని... లోకేశ్ లాంటి వాళ్లు విసిరే సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ముందు ఎక్కడైనా గెలిచి అగోరించవయ్యా అంటూ లోకేశ్ను ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications