ఇండియాలో అనంతపురం సంచలన రికార్డ్
రాయలసీమలో భానుడు భగభగలాడుతున్నాడు. ఈనెల మొదటివారం నుంచే సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. అనంతపురంలో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశం మొత్తంమీద అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 27వ తేదీ వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుందని, ఉక్కపోతతోపాటు ఎండవేడి అధికంగా ఉంటుందని తెలిపారు. మరోవైపు రాయలసీమ, కోస్తాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వాతావరణం చాలా పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి వ్యాపించింది. క్రమేపీ ఇది బలహీనపడుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

గతేడాదిలా ఈ ఏడాది కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. మరో ఐదురోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని తెలిపారు. క్రమేణా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వారం రోజుల నుంచి రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఎండల తీవ్రత కూడా కాస్తంత తగ్గింది. ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వర్షసూచన లేదని, ఒకటి రెండు చోట్ల అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
ఏప్రిల్ చివరి వారం, మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరతాయని అంచనా వేస్తున్నారు. మరో వారం రోజులు గడిచిన తర్వాత వేసవి వాతావరణం ఎలా ఉండబోతోందనే విషయంలో స్పష్టత వస్తుందని, అప్పుడు వాతావారణశాఖ సూచించే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications