నడి సంద్రంలో ఆగిపోయిన అండమాన్ నౌక: ఏపీ ప్రయాణికుల ఆందోళన
విశాఖపట్నం: నగర తీరం నుంచి మంగళవారం బయల్దేరిన అండమాన్ నౌక్ 'హర్షవర్ధన్’ నడి సముద్రంలో నిలిచిపోయింది. నౌకలో 600మంది ప్రయాణికులు ఉండగా, ఇందులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగానే నౌక నడి సముద్రంలో ఆగిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 1.20గంటలకు ప్రయాణికులతో విశాఖ తీరం నుంచి బయల్దేరిన నౌక.. సాంకేతిక లోపం కారణంగా నడి సముద్రంలో నిలిచిపోయింది.
అల్ప పీడన ప్రభావంతో సముద్రం అలజడిగా ఉండటంతో నౌకలోని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన ప్రయాణికుల బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విశాఖ నుంచి 6గంటల ప్రయాణం చేసిన అనంతరం నిలిచిపోయినట్లు తెలిసింది. కాగా, 50ఏళ్లుగా ఈ నౌక అండమాన్-విశాఖ తీరాల మధ్య రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు స్పందించి మళ్లీ విశాఖ తీరానికి నౌకను తీసుకువచ్చే అవకాశం ఉంది.
స్పందించిన నేవీ అధికారులు
నౌకలోని సమస్య పరిష్కారానికి మరో 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని మర్చంట్ నేవీ అధికారులు వెల్లడించారు. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర కూలీలు విశాఖ పోర్టు నుంచి నౌక ప్రయాణం ద్వారా అండమాన్ వెళ్తుంటారు. మంగళవారం కూడా అలా వెళ్తుండగానే ఈ ఘటన జరిగింది. నౌక మరమ్మతులు పూర్తయిన తర్వాత కూలీలను తిరిగి విశాఖ తీసుకు రావాలా లేక అదే నౌకలో అండమాన్ పంపాలా అనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేవీ అధికారులు చెప్పారు.
నౌకలోని ప్రయాణికులందరికీ ఆహార పదార్థాలు అందజేసినట్లు పోర్ట్ ఛైర్మన్ జేసీ తెలిపారు. మరో రెండు మూడు గంటల్లో నౌక మరమ్మతులు చేసి అండమాన్ కు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.