పబ్లిసిటీ పీక్.. జనంలో వీక్
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. ఈ నెల 27వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
దీని తరువాత షెడ్యూల్ వెలువడేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా వంద సభలను నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా..కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తిస్థాయి ప్రచారానికి దిగింది.

ఈ పరిస్థితుల మధ్య ఏపీలో జరగబోయే ఎన్నికలపై సర్వే నివేదికలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, లోక్ పోల్.. వంటి జాతీయ స్థాయి సర్వే సంస్థలు తమ అంచనాలను బయటపెట్టాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారనీ స్పష్టం చేస్తోన్నాయి. 52 శాతం మంది ముఖ్యమంత్రిగా జగన్ను కోరుకుంటోన్నాయని తేల్చి చెప్పాయి.

వచ్చే ఎన్నికల్లో 115 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయఢంకా మోగిస్తుందని పొలిటికల్ క్రిటిక్ తెలిపింది. తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమికి 60 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపింది. భారతీయ జనతా పార్టీ గానీ, కాంగ్రెస్ గానీ అసలు ఖాతాలను కూడా తెరవ లేవని అంచనా వేసిందా సంస్థ.
లోక్సభ ఎన్నికలపై లోక్ పోల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే.. వైఎస్ఆర్సీపీకే జైకొట్టింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తెలిపింది. వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 లోక్సభ స్థానాలు లభిస్తాయి. టీడీపీ- జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలకు పరిమితం చేసింది.

జనసేనతో పొత్తుకు ముందు నిర్వహించిన సర్వేలో టీడీపీకి ఏడు లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇప్పుడా సంఖ్య ఎనిమిదికి పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక బీజేపీ/ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీలు.. ఒక్కొక్క లోక్స్థానాన్ని గెలుచుకుంటాయని లోక్ పోల్ తెలిపింది.
పొత్తు ఉన్నప్పటికీ.. టీడీపీ- జనసేన కూటమి అధికారానికి ఆమడదూరంలో నిలిచిపోతాయనేది ఆయా సర్వే సంస్థలన్నింటి సారాంశం. పవన్ కల్యాణ్ ఛరిష్మా గానీ, కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు గానీ.. కొంతవరకు మాత్రమే కూటమిని ప్రభావితం చేయగలుగుతుందని, అధికారాన్ని మాత్రం అందించలేవని స్పష్టమౌతోంది.












Click it and Unblock the Notifications