స్పీకర్ అత్యుత్సాహం, రోజాను తట్టుకోలేకే: జ్యోతుల, 'బాక్సైట్'పై తగ్గిన బాబు!
హైదరాబాద్: ఏపీ శాసన సభలో సభాపతి కోడెల శివప్రసాద రావు అత్యుత్సాహం బయటపడిందని, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు అలా వ్యవహరిస్తున్నారని వైసిపి నేత జ్యోతుల నెహ్రూ మంగళవారం చెప్పారు.
లోటస్ పాండులో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పీకర్ కోడెల నిష్పక్షపాతంగా వ్యవహరించనందుకు నిరసనగా ఆయన పైన మేం రేపు (బుధవారం) ఉదయం పదిన్నర గంటలకు అవిశ్వాసం నోటీసు ఇస్తామని చెప్పారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు జగన్ మీడియాతో అసెంబ్లీ జరిగిన తీరుపై మాట్లాడుతారన్నారు.
సభాపతి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని విశ్వాసంలోకి తీసుకు వెళ్లడం లేదన్నారు. అధికార పార్టీ సభ్యులు కోర్టులో ఉన్న అంశాలను సభలో ప్రస్తావించినప్పుడు స్పీకర్ వారిని వారించే ప్రయత్నం చేయలేదన్నారు.
కాల్ మనీ - సెక్స్ రాకెట్ విషయమై చంద్రబాబు తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యే రోజానే మాట్లాడాలని, కాబట్టి ఆమె వాగ్ధాటిని తట్టుకోవడం సాధ్యం కాదనే నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారన్నారు. ఈ విషయమై తాము పోరాటం చేస్తామన్నారు.
రోజా సస్పెన్షన్కు, సభాపతి పైన అవిశ్వాసానికి సంబంధం లేదని చెప్పారు. నిబంధనల ప్రకారం రోజాను సస్పెండ్ చేసే హక్కు లేదన్నారు. 340 సెక్షన్ ప్రకారం ఆ అధికారం లేదన్నారు.
సభలో జగన్ నలభై నిమిషాలు మాట్లాడితే 17సార్లు అంతరాయం కలిగించారన్నారు. ఇంత దారుణంగా వ్యవహరించిన స్పీకర్ను తనకు ఊహ తెలిసినప్పటి నుంచి, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
అసెంబ్లీ నిరవధిక వాయిదా
మంగళవారం సాయంత్రం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ 26 గంటల ఎనిమిది నిమిషాలు నడిచింది. సభలో సభ్యులు 49 ప్రశ్నలు వేశారు. ఎనిమిది బిల్లులు ఆమోదం పొందాయి. సభలో పది అంశాల పైన చర్చించారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది.
బాక్సైట్ జీవోను రద్దు చేసిన చంద్రబాబు
సభ నిరవధిక వాయిదాకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో మాట్లాడారు. ఇసుక విధానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. మెరుగైన ఇసుక విధానానికి శ్రీకారం చుడతామన్నారు. దూర ప్రాంతాలకు కూడా ఇసుక అందాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.