ఏపీ విద్యార్థులకు అలర్ట్: ఇంటర్ ఫలితాలు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 26 అంటే బుధవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శేషగిరిరావు వెల్లడించారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం రెగ్యూలర్ విద్యార్థులు 9,20,552 మంది, ఒకేషనల్ విద్యార్థులు 83,749 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొదటి సంవత్సరానికి చెందిన 4.84 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఏపీ ఇంటర్ ఫలితాల కోసం bie.ap.gov.in ను సంప్రదించవచ్చు.
ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు 30 నుంచే?
ఇది ఇలావుండగా, ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దలు, పిల్లలు ఎండతీవ్రతతో సతమతమవుతున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో కూడా త్వరలోనే వేసవి సెలవులను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 27తో పరీక్షలు ముగియనున్నాయి. దీంతో ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం.
కాగా, పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంతో ఏప్రిల్ 28 నుంచే సమ్మర్ హాలిడేస్ మొదలయ్యే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ద్వారా అనధికారిక సమాచారం. ఈసారి స్కూల్స్కు వేసవి సెలవులు సుమారు 45 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక వచ్చే విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం కానున్నాయి. అటు అడ్మిషన్లు కూడా జూన్ 1 నుంచి మొదలవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications