అనురాధ హత్య: మొదటిసారి ఓ మహిళ, రెండు ప్లాన్లను జోడించిన హంతకులు
చిత్తూరు: మేయర్ అనురాధను, ఆమె భర్త కటారి మోహన్ను హత్య చేయడానికి దుండగులు రెండు పథకాలను సిద్ధం చేసుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఒకటి పని చేయకపోతే మరో పథకం అమలు చేయాలనే ఉద్దేశంతో అటు కత్తులతోనూ ఇటు తుపాకులతోనూ లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు.
దుండగులు ప్లాన్-ఎ, ప్లాన్-బి అని రెండు ప్రణాళికలతో వచ్చినట్లు హత్య జరిగిన తీరు వెల్లడిస్తోంది. తుపాకులతో కాల్చి చంపడం ప్లాన్-ఏ కాగా, ఒకవేళ టార్గెట్ చెయ్యడంలో విఫలమైతే కత్తులతోనైనా నరికి చంపాలని హంతకులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
పథకాన్ని అమలు చెయ్యడానికి ఘటనా స్థలం వద్దకు మంగళవారం ఉదయం ఆరుగురు వ్యక్తులు రాగా వారిలో ఇద్దరి దగ్గర పాయింట్ 32 గన్స్, మరో నలుగురి వద్ద కత్తులు ఉన్నాయని అంటున్నారు. అయితే, హత్యలో ముగ్గురు పాల్గొన్నారా, ఆరుగురు పాల్గొన్నారా అనేది పోలీసులు ఇంకా నిర్ధారించుకోలేకపోతున్నారు.

దుండగులు వచ్చీ రాగానే హంతకులు మేయర్ దంపతులపై బులెట్ల వర్షం కురిపించారు. అయితే, అప్పటికే కార్యాలయంలో మరికొందరు కూడా ఉండటంతో తమపై ఎదురు దాడి జరిగే అవకాశం ఉందని భావించి హంతకులు ప్లాన్-ఎకు ప్లాన్-బిని కూడా జోడించి కత్తులతోనూ నరికినట్లు చెబుతున్నారు. హంతకులు వచ్చిన వైపే మేయర్ అనూరాధ ఉండటంతో ఆమె వారికి ఈజీ టార్గెట్ అయ్యారు.
పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు, ఆపైన కత్తులతో దాడి జరగడంతో ముందుగా ఆమె బలైపోయారు. ఆమె కన్ను, ఛాతీ భాగాల్లో బులెట్లు దిగాయి. మేయర్ భర్త మోహన్ కాస్త దూరంలో ఉండటం వల్ల గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న మోహన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎస్పీ శ్రీనివాస్ అందించిన వివరాలు కూడా ఈ పరిస్థితులనే స్పష్టం చేస్తున్నాయి.
అనురాధ హత్య కేసులో పోలీసులు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాయింట్ 32 గన్తో పాటు హంతకుల వద్ద ఎయిర్ పిస్టల్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. హంతకులు వాడిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మేయర్ దంపతులపై దాడి భద్రతా వైఫల్యం వల్లనే జరిగిందనే వాదనను ఎస్పీ శ్రీనివాస్ ఖండిస్తున్నారు. వారు నిరాకరించడం వల్లనే తాము భద్రతను కల్పించలేదని ఆయన చెబుతున్నారు. ఫాక్షన్ కక్షలకు ఓ మహిళ బలి కావడం చిత్తూరు జిల్లాలో ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications