పొత్తు వేళ చంద్రబాబుకు బీజేపీ భారీ షాక్ - మళ్లీ మొదటికి..!!
ఏపీ పొత్తుల్లో భారీ ట్విస్ట్. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేయటం ఖాయమైంది. సీట్ల పైన సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ అభ్యర్దులను ప్రకటించాయి. అంతా సజావుగా సాగుతున్న వేళ బీజేపీ నేతలు అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. పొత్తులో భాగంగా సీట్లు..అభ్యర్దుల ఖరారు పైన తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, అమిత్ షాకు లేఖ రాసారు. ఈ సీట్లకు ఓకే చెబితే మరోసారి వెన్నుపోటు ఖాయమని హెచ్చరించారు.
పొత్తులో కొత్త ట్విస్ట్
ఏపీలో పొత్తుల్లో భాగంగా సీట్ల గురించి టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ అదే విధంగా జనసేనకు 2 ఎంపీ, 21 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి కేటాయించే సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల గురించి చంద్రబాబు, పవన్ తో చర్చించిన బీజేపీ నేత గజేంద్ర షెకావత్ ప్రతిపాదనలకు హైకమాండ్ కు నివేదించారు. సీట్ల సంఖ్య, కేటాయించిన స్థానాల పైన ఏపీలోని బీజేపీ నేతలు విభేదిస్తున్నారు. పొత్తు విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి పార్టీ కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామని చెబుతూనే... సీట్ల సంఖ్య, కేటాయించినట్లుగా చెబుతున్న నియోజకవర్గాల పైన తమ అభ్యంతరం వ్యక్తం చేసారు.

సీట్లు - అభ్యర్దులు సరికాదు
పలు అంశాలతో ఏపీకి చెందిన సీనియర్ బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసారు. అదే కాపీని ప్రధాని మోదీ, అమిత్ షాకు పంపారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. టీడీపీతో సీట్ల సంఖ్య పైన హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా..టీడీపీ ప్రతిపాదించిన స్థానాలు బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇచ్చిన సీట్ల విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. తెలుగుదేశం కోసం పని చేసిన వారి కోసమే సీట్లు కేటాయించేలా నిర్ణయం జరుగుతుందని ఫిర్యాదు చేసారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు సీట్లు కేటాయించటం ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. బీజేపీకి టీడీపీ దురుద్దేశ పూర్వకంగా ఎంపిక చేసిన సీట్లను కేటాయిస్తోందని..అందుకు గల కారణాలను లేఖలో వివరించారు.
పార్టీకి నష్టం తప్పదు
గతంలో టీడీపీ ఓడిపోయినవి.. ఏ మాత్రం బలం లేని స్థానాలు బీజేపీకి కేటాయించదని విశ్లేషించారు. అదే విధంగా టీడీపీ చేతిలో ఉన్న నేతలుగా గుర్తింపు ఉన్న వారికి బీజేపీలో సీట్లు ఇవ్వటం ద్వారా పార్టీకి భర్తి చేయలేని నష్టం ఖాయమని హెచ్చరించారు. పార్టీ ప్రకటించాల్సిన అభ్యర్దులను సైతం వారే ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోందని చెప్పుకొచ్చారు. ఆరు సీట్లకు పరిమితం కాకుండా మరిన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కించుకొనేలా నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా పలువురు సీనియర్ నేతలు సంతకాలు చేస్తూ ఈ లేఖను ప్రధానికి పంపారు. సీట్ల విషయంలో పార్టీ అధినాయకత్వం స్థాయిలోనే నిర్ణయాలు జరగాలని..పార్టీ కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీంతో, ఇప్పుడు సీట్ల విషయంలో బీజేపీ నాయకత్వం ఏం చేయబోతోందనేది ఉత్కంఠా మారుతోంది.












Click it and Unblock the Notifications