మోడీ టూర్ లో దొంగల హడావిడి-విశాఖలో కబ్జాకోరుల్ని వదిలేసి ! వైసీపీ సర్కార్ పై బీజేపీ ఫైర్
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయంలో ప్రధాని మోడీ విశాఖ టూర్ ఓ టర్నింగ్ పాయింట్ ఇస్తోంది. మోడీ టూర్ అధికారిక కార్యక్రమం కాబట్టి ఇందులో విపక్షాల్ని దూరం పెట్టాలని వైసీపీ భావిస్తుండగా.. వైజాగ్ లో తమ తప్పిదాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఇదంతా చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో తాజాగా ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతల్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు.
విశాఖలో 15వేల కోట్లకు పైగా కేంద్ర పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా జరగనున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి పురంధేశ్వరి తెలిపారు. ప్రధాని నిర్మాణం కోసం వస్తుంటే జగన్ సర్కారు మాత్రం ప్రధాని పర్యటన పేరిట కూల్చివేతలు సాగిస్తున్నారన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, టైము ఇవ్వకుండా పేదల ఇళ్లు, షాపులు కూల్చారన్నారు. మరి భూకబ్జాలు చేసిన వారిమీద ఎందుకు అలా చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ విధ్వంసానికి బెదిరిపోయి రాష్ట్రంలోకి పెట్టుబడిదార్లు రావటం లేదన్నారు. దిల్లీ లిక్కర్ స్కాములో ఈ రోజు అరెస్టయిన వారు ఎవరికి దగ్గరవారు? శరత్ చంద్రారెడ్డి ఎవరి మనిషి? అరవిందో ఎవరిది? అని పురంధేశ్వరి ప్రశ్నల వర్షం కురిపించారు.

మరోవైపు విశాఖ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తూ కబ్జాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. దసపల్లా భూముల కుంభకోణం మీద సీబీఐ,ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజలు వీటిలో ఫ్లాట్లు కొంటే నష్టపోతారు కనుక కొనద్దని సీఎం రమేష్ సూచించారు. ప్రధాని పర్యటనలో దొంగల హడావిడి ఎక్కువైందన్నారు. ఆయన అన్నీ గమనిస్తారని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతి అక్రమాలూ సహకరించరని, దిల్లీలో సతీష్ అరెస్టే ఇందుకు నిదర్శనమన్నారు.

విశాఖలోనూ, ఏపీలోనూ కేంద్రం ఎన్నో ప్రాజెక్టులు చేపడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
తెలిపారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి ప్రధాని కృషి చేస్తున్నారని, ఆయనకు వివక్ష లేదని తెలిపారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు పూర్తిగా విరుద్ధమన్నారు. అక్రమాలకు అన్యాయాలకు ఎక్కడ అవకాశం ఉందా అని వెతుకుతుంటారన్నారు. కక్ష సాధింపు చర్యలతో పాలన సాగిస్తారని కూడా సత్యకుమార్ చెప్పుకొచ్చారు. భూసర్వేలకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి దానిలో అవినీతి ఎలాగో వెతుకుతారని, వివాదాలు సృష్టించి, భయపెట్టి భూములు కాజేస్తున్నారని విమర్శించారు. భూరక్ష, భూహక్కు పథకం పేరుతోనూ భూకబ్జాయే చేస్తున్నారన్నారు.పెందుర్తిలో 40 ఎకరాల భూకబ్జా చేసిన మంగళ కృష్ణ ఎవరు? ఎన్ని కేసులున్నాయి అని ప్రశ్నించారు. విశాఖలో పులివెందుల కబ్జా బ్యాచ్ తిష్ట వేసిందని, భూములు ఆక్రమణలు కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జా చేస్తుందన్నారు. సిట్ నివేదిక బయటకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications