మాకొక కొత్త గవర్నర్ కావలెను:కేంద్రానికి ఎపి బిజెపి ఎంపీ లేఖ...సంచలనం
విశాఖపట్టణం: ఎపి బిజెపి నేతలు అన్నంత పనీ చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఆంధ్ర ప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఆయన మీద కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన బిజెపి నేతలు చివరకు అదే పని మరో రకంగా చేసేశారు. నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ కావాలంటూ బిజెపి ఎంపి, ఎపి భాజపా అధ్యక్షుడు హరిబాబు కేంద్రహోంమంత్రి కి లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది.
ఎపి బిజెపి అధ్యక్షుడు, ఎంపి హరిబాబు రాసిన ఓ లేఖ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నవ్యాంధ్రకు కొత్త గవర్నర్ కావాలంటూ కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు విశాఖ పట్టణం ఎంపి హరిబాబు రాసిన లేఖ కలకలం సృష్టించింది. అలాగే హైకోర్టు కోసం ప్రభుత్వం భవనాలను అన్వేషిస్తోందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని కూడా ఎంపి హరిబాబు ఆ లేఖలో కేంద్ర హోం మంత్రిని కోరారు.
అయితే రాజ్నాథ్సింగ్కు ఎంపి హరిబాబు రాసిన లేఖ అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశం అయింది. కొన్ని రోజుల క్రితమే విశాఖకే చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్పై సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చెయ్యడంతో పాటు ఆయనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ కే చెందిన ఎంపి హరిబాబు నేరుగా ప్రస్తుత గవర్నర్ నరసింహన్ పై కేంద్రానికి ఫిర్యాదు చెయ్యకపోయినప్పటికి పొమ్మన లేక పొగబెట్టినట్లు మాకు కొత్త గవర్నర్ కావాలంటూ కేంద్రానికి లేఖ రాయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ పరిణామం ఎలా దారితీస్తుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.