చెడ్డపేరుంటే టిక్కెట్లివ్వను, నంద్యాలపై వైసీపీని కలుద్దాం: బాబు సంచలనం
ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకొన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించబోనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
అమరావతి: ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకొన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించబోనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు వల్లే పార్టీకి, తనకు చెడ్డపేరు వస్తోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసిన వారు మూల్యం చెల్లించాల్సిందేనని బాబు అన్నారు.
సోమవారం నాడు అమరావతిలో నిర్వహించిన పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో బాబు కొందరు పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరుతో పార్టీ జరుగుతున్న నష్టంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పద్దతిని మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు.
Recommended Video

ఇటీవల కాలంలో పార్టీకి చెందిన నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఈ విషయమై పార్టీ నేతలు తీరు మార్చుకోవాలని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, వారి తీరులో మార్పు రావడం లేదు.
అయితే కఠినంగా వ్యవహరించకపోతే ఫలితాలు ఉండవనే అభిప్రాయంతో ఉన్నారనే సంకేతాలను ఇచ్చే ఉద్దేశ్యంతో బాబు ఉన్నారు.ఈ విషయమై ఆయన మహనాడు వేదికపై పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

చెడ్డపేరు తెచ్చుకొంటే టిక్కెట్లు ఇవ్వను
పార్టీకి చెడ్డపేరు తేవడంతో పాటు నియోజకవర్గంలో ప్రజలతో చెడ్డపేరు తెచ్చుకొనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించబోనని టిడిపి అధినేత చంద్రబాబునాయుుడు ప్రకటించారు.కొందరు ఎమ్మెల్యేల అవినీతి కారణంగానే తనను ఇతర పార్టీలకు చెందిన నేతలు వేలెత్తి చూపిస్తున్నారని ఆయన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఇప్పటికైనా పార్టీ నేతలు తమ పద్దతిని మార్చుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వబోనని చెప్పారు.

మెత్తగా ఉంటున్నానని తప్పులు చేస్తారా
తాను మెత్తగా ఉంటున్నానని తప్పులు చేస్తూ పార్టీకి నష్టం చేస్తారా అని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో బాబు ప్రశ్నించారు.కొందరు ఎమ్మెల్యేలు చేసే తప్పులకు పార్టీ బాధ్యత వహించాలా అని ఆయన ప్రశ్నించారు. నేను మెత్తగా ఉంటున్నానని అనుకోవద్దని ఆయన పార్టీ నేతలను హెచ్చరించారు. టిక్కెట్లు కేటాయించే సమయంలో ప్రతి అంశం లెక్కకు వస్తోందని బాబు అభిప్రాయపడ్డారు. జన్మభూమి కమిటీ సభ్యుల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడ జాగ్రత్తగా మసులు కోవాలని బాబు సూచించారు.

గరగపర్రు ఘటన ఎందుకు ఇంత దూరం వచ్చింది
సమస్యల్లోని తీవ్రతను, సున్నితత్వాన్ని గుర్తించడంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇంకా తడబడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల సమస్యలు ఇంకా పెరుగుతున్నాయని చెప్పారు. గరగపర్రు ఘటన ఇంత దూరం రాకూడదన్నారు. తొలుతే ఈ సమస్యను పట్టించుకొని ఇరువర్గాలను కూర్చొబెట్టి మాట్లాడితే విషయం ఇంత పెద్దది కాదన్నారాయన.ఈ ఘటన వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు.ఎమ్మెల్యే శివరామరాజు ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడంతో పాటు వేగంగా కదలకపోవడం కారణంగా ఈ సమస్య పెద్దదైందన్నారు. చాపరాయిలో వైద్యశాఖ ముందే స్పందించి ఉండాల్సిందన్నారు.మీ స్థాయిలో సమస్యలను పరిష్కరించలేరా అంటూ ఆయన మంత్రులను ప్రశ్నించారు

ప్రజాప్రతినిధులకు గ్రేడింగ్
పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులకు గ్రేడింగ్ ఇస్తున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. బీ గ్రేడ్ లో ఉన్నవారు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని బాబు సూచించారు. పనితీరును మెరుగుపర్చుకొనేందుకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.సీ గ్రేడ్ లో ఉన్నవారిని పక్కన పెట్టడం మినహా మరోమార్గం లేదన్నారాయన.తమ గ్రేడింగ్ ల ఆధారంగా పనితీరును మెరుగుపర్చుకోవాలని బాబు సూచించారు. ఎప్పటికప్పుడు ఆయా నేతలు, ప్రజాప్రతినిధులకు గ్రేడింగ్ వివరాలను ఇవ్వనున్నట్టు చెప్పారు.

మీడియాలో వార్తలు రాయిస్తారా
ఇన్ చార్జీ మంత్రి సమావేశం ఏర్పాటుచేస్తే సమావేశానికి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హజరుకావాలని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా పార్టీ సమావేశానికి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హజరుకాకపోవడంపై అలిగి మీడియాకు ఎక్కడం సరైందికాదని ఆయన మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహరశైలిని తప్పుబట్టారు. తాను పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని నాయకులు దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలుగా ఉన్న మంత్రులు, తమకుక కేటాయించిన ప్రాంతంలో నెలకు వారం రోజులపాటు పర్యటించాలని ఆయన ఆదేశించారు.

నంద్యాలపై వైసీపీకి వినతి
నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని వైసీపీని కోరాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు.అయితే వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇక ఏకగ్రీవం కోసం ప్రకటించడం అవసరం లేదని మంత్రి యనమల అభిప్రాయపడ్డారు.అయితే ఈ విషయమై వైసీపీని కోరితే బాగుంటుందన్నారు. అయితే ఇదే అభిప్రాయంతో బాబు కూడ ఉన్నారు. రాగ్యానాయక్ చనిపోయిన సమయంలో అప్పటి సిఎల్పీ నాయకుడు వైఎస్ ఈ విషయమై చేసిన వినతిని ఆనాడు టిడిపిగా గౌరవించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఈ విషయమై అసెంబ్లీలో వైసీపీని కోరనున్నారు. అయితే ఎన్నికలు జరిగినా ఈ స్థానంలో విజయం సాధిస్తామని బాబు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications