కుమార్తెకు ముఖ్యమంత్రి జగన్ బెస్ట్ విషెస్.. పారిస్ వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పెద్దకుమార్తె హర్షారెడ్డికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. పారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షారెడ్డి జులై 2వ తేదీన గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆ కాన్వొకేషన్లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు 10 రోజులు అనుమతిచ్చింది. తన కుమార్తె కాలేజ్ కాన్వొకేషన్లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాల్సి ఉందని, వారం రోజుల అనుమతి కావాలంటూ జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి 10 రోజుల అనుమతి మంజూరు చేయడంతో ముఖ్యమంత్రి తరఫు న్యాయవాదులు ఖుషీ అవుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి పారిస్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న హర్షారెడ్డి జులై రెండోతేదీన కాన్వొకేషన్ తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్తోపాటు కుటుంబ సభ్యలుంతా హాజరవుతున్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన హర్షారెడ్డి ఆ తర్వాత పారిస్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పారిస్ వెళ్లే సమయంలోను జగన్ బెంగళూరు వెళ్లి దగ్గరుండి తన కుమార్తెకు బెస్ట్ విషెస్ తెలిపి పంపించారు.
జులై 4వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి రానుండటంతో.. పారిస్ లో కాన్వొకేషన్ కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రానికి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాను కూడా ప్రధానమంత్రి సభలో పాల్గొంటున్నానని, భద్రత కల్పించాలంటూ కోరారు. రాజకీయంగా ఈ విషయంపై జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. జులై 8వ తేదీ స్వర్గీయ వెఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 8, 9 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్యలో పార్టీ ప్లీనరీ జరగనుంది. పారిస్ నుంచి రాగానే ఈ కార్యక్రమాలతో జగన్ షెడ్యూల్ బిజీబిజీగా ఉంది.