కుప్పం నుంచి 'లెక్క'పెడుతున్న సీఎం జగన్?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. చంద్రబాబు ఎక్కువ సమయం కుప్పంమీదే దృష్టి సారించేలా చేయగలిగితే ఇతర నియోజకవర్గాలపై దృష్టిపెట్టలేరని, అది తనకు కలిసివస్తుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో పావులు కదుపుతున్నారు. కుప్పంలో పార్టీని నిలవరిస్తే రాష్ట్రవ్యాప్తంగా నిలవరించడం సులవవుతుందని వైసీపీ భావిస్తోంది.

1989 నుంచి వరుస జయభేరి
1989 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీచేసిన చంద్రబాబు ఆ తర్వాత అక్కడి నుంచి 2019 ఎన్నికల వరకు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. చంద్రబాబును ఇక్కడ ఓడించగలిగితే అధికారం సాధ్యపడుతుందని జగన్ తలపోస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న 'ఓదార్పు' యాత్ర చేసే సమయంలో కూడా కుప్పం వెళ్లని జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వెళ్లారు.

సీఎం జగన్ రాజకీయ వ్యూహం!
రూ.66 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు 33 సంవత్సరాలుగా కుప్పం నుంచి బాబు చాలా తీసుకున్నారని, అవన్నీ తిరిగిచ్చేయాలంటూ జగన్ బీసీ మంత్రాన్ని వల్లెవేశారు. బీసీ మంత్రంతో చంద్రబాబును ఓడించాలని వైసీపీ అధిష్టానం యోచనగా ఉంది. అందుకే బీసీ మంత్రాన్ని జగన్ పఠించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీసీలందరినీ వైసీపీవైపు మళ్లించే రాజకీయ వ్యూహంలో ఇది కూడా ఒక భాగమేనని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

అన్నీ ఆలోచించే 'లెక్కపెట్టిన' జగన్!
నూట్రల్ ఓటర్లను అభివృద్ధి పనులద్వారా ఆకట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. రూ.66 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులతోపాటు 45 సంవత్సరాల వయసు దాటిని మహిళల కోసం చేయూత పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభించారు. వచ్చే నెల నుంచి పెంచివ్వనున్న పింఛను పెంపును కూడా కుప్పం నుంచే జగన్ ప్రకటించారు. యువతరం ఓట్ల కోసం ఎమ్మెల్సీ భరత్ యువకుడే కాబట్టి లెక్క సరిపోతుందనే అంచనాకు వచ్చారు. స్థానికంగా ఉన్న బలమైన నేతలందరినీ పార్టీలోకి చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ జెండాను ఎగరవేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. చంద్రబాబును ఓడించడానికి పక్కాగా ప్రణాళికలు రచించుకుంటున్న వైసీపీ ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications