ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఫార్ములా?
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణలో అధికారం దక్కడం ఖాయమని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేసుకున్నారు. వారి అంచనా ఇప్పటికీ తప్పుతూనే ఉంది. తెలంగాణకు రెండుసార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు అధికారానికి దూరమైంది. రాష్ట్ర విభజన అనంతరం 2014, 2019 ఎన్నిక్లో ఏపీలోని కాంగ్రెస్ నాయకులంతా సైలెంటయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 3 లక్షల 68వేల 810 ఓట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో జాతీయస్థాయిలో బలంగా ఉన్న భారతీయ జనతాపార్టీకి 2 లక్షల 63వేల 849 ఓట్లు వచ్చాయి.

బీజేపీ కంటే ఎక్కువ ఓట్లు
సరైన నాయకత్వం, ప్రచార వ్యూహం లేకుండా పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకంటే దాదాపు లక్షా 5 వేల ఓట్లు అధికంగా రాబట్టగలిగింది. కొన్ని సాంప్రదాయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ దూరం కాలేదని, ఎటువంటి పరిణామాలు సంభవించినా వారు మాత్రం కాంగ్రెస్ వైపేనని ఏపీలో గడిచిన రెండు ఎన్నికలు నిరూపించాయి. దీంతో రానున్న ఎన్నికల్లో సీట్లకన్నా ఓటింగ్ శాతం పెంచుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. 2024 ఎన్నికలు వైసీపీకి, టీడీపీకి కీలకం. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తనకు సాంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్నవారి నుంచి ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. అందుకు తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఫార్ములాతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

8 నుంచి 10 శాతం ఓటింగ్ తెచ్చుకునేలా..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించింది. కచ్చితంగా విజయావకాశాలున్న నియోజకవర్గాలు, హోరాహోరీ పోరు సాగే సెగ్మెంట్ లు, బలహీనంగా ఉన్న స్థానాలను గుర్తించి వాటికి వేర్వేరుగా వ్యూహాలను రూపొందించారు. 2019 ఎన్నికలలో 1.17 శాతం గా వున్న ఓటింగ్ ను వచ్చే ఎన్నికల నాటికి కనీసం 8 నుంచి 10 శాతానికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఉద్ధండుల అండ
ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు ఎన్ రఘువీరా రెడ్డి, డాక్టర్ డి ఎల్ రవీంద్రా రెడ్డి, డాక్టర్.చింతా మోహన్, డాక్టర్ సాకే శైలజానాథ్, కనుమూరి బాపిరాజు, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, తులసిరెడ్డి, పల్లంరాజు, వట్టి వసంతకుమార్ లాంటి నేతలున్నారు. లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటివారు తటస్థంగా ఉన్నారు. కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లగా, మరికొందరు టీడీపీలోకి వచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇటువంటి ఉద్ధండులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన జవసత్వాలు కూడగట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications