హైదరాబాద్లో రక్షణ లేదు, అడుగడుగునా అవమానాలే: రాష్ట్రపతితో ఏపి సీఎస్
హైదరాబాద్: పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలకు రక్షణ లేదని, అడుగడుగునా అవమానాలకు గురవుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఏపి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. మంగళవారం రాష్ట్రపతిని కలిసిన కృష్ణారావు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పని చేస్తున్న సీనియర్ బ్యూరోక్రాట్లతో జంట నగరాల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వరుసగా అధికారులకు ఎదురవుతున్న అవమానాల నేపథ్యంలో సెక్షన్-8 అమలుచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఏపి సీఎస్ సమర్పించిన వినతి పత్రంలోని పలు అంశాలు ఇలా ఉన్నాయి. విభజన చట్టంలో ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంతానికే చెందుతాయన్న నిబంధనను అవకాశంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా షెడ్యూల్-10లోని సంస్థలపై ఆధిపత్యం చెలాయిస్తోందని తెలిపారు.

ఆ సంస్థల నుంచి సేవలు పొందాలనుకుంటే ఫీజు చెల్లించి ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తోందని చెప్పారు. విభజనకు ముందు రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఆ సంస్థలన్నీ నిర్మించారనీ, అందువల్ల రాజధానిలోని సంస్థలు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన విభజించాలని కోరారు.
రెండు రాష్ట్రాలకు సేవలు అందిస్తున్న సంస్థల విభజనపై ఏడాదిగా ఒక అవగాహనకు రాలేకపోతే కేంద్ర ప్రభుత్వమే విభజన పద్ధతులు నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాబట్టి, సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే వరకు లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు 2014 జూన్ నాటి పూర్వ స్థితినే(స్టేటస్ కో యాంటే) షెడ్యూల్-10లోని సంస్థలకు వర్తింపజేయాలని కోరారు.
వాణిజ్యపరమైన సంస్థలున్న షెడ్యూల్-9లోని సంస్థల విభజనపై కూడా వివాదం నొలకొందని, ఈ షెడ్యూల్లోని ఆస్తులు, అప్పులు విభజించడానికి షీలా బేడీ కమిటీని నియమించినప్పటికీ ఉద్యోగుల విభజనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.
ఉద్యోగులను స్థానికత ఆధారంగా విభజించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం ట్టుబడుతోందని, ఈ ప్రతిపాదికన విభజన చేపడితే ఏపిలోని వాణిజ్య సంస్థలన్నీ వేతన బిల్లులతో నష్టాలపాలవుతాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications