గిరిజనుల పాదాలకు 'పవన్' చెప్పులు.. డిప్యూటీ సీఎం దాతృత్వం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆయన తన సొంత డబ్బులతో ఆదుకుంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా గిరిజనులకు వినూత్న కానుకలు పంపించి.. వారికి అండగా ఉంటానని మరోసారి నిరూపించుకున్నారు పవన్ కల్యాణ్.
ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పిఠాపురంలో పదివేల మంది మహిళలకు పవన్ కల్యాణ్ చీరలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తనను ఆదరించి గెలిపించి.. తొలిసారి అసెంబ్లీకి పంపిన ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాను స్వయంగా ఆయన వెళ్లకపోయినా.. పార్టీ నాయకులతో పంపిణీ చేశారు.

అయితే తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. తాజాగా తన సొంత డబ్బులతో 345 మంది గిరిజనులకు పవన్ నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు.వీటిని తన కార్యాలయ అధికారులకు ఇచ్చి పవన్ పంపించారు. ఈ క్రమంలో కురిడి, పెదపాడు గ్రామాల్లో పర్యటించిన అధికారులు.. పవన్ పంపిన చెప్పులను గిరిజనులకు పంపిణీ చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
గిరిజన వాసాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు 'అడవితల్లి బాట' పేరుతో పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. జిల్లాలోని పెదపాడు, కురిడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమయంలో అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతోపాటు.. ఎక్కడికక్కడ ముళ్లు, రాళ్లు ఉండటం గమనించారు. అయితే అలాంటి రోడ్లపై చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి పవన్ చలించిపోయారు. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని తెలిసింది. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి.. గ్రామంలో మొత్తం ఎంత మంది ఉంటారో ఆరా తీయించి.. వారందరికీ ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు.

ఆ తర్వాత 345 జతల చెప్పులను తన సొంత డబ్బుతో కొనుగోలు చేశారు. వీటిని తాను వెళ్లకపోయినా.. తన కార్యాలయం అధికారులకు ఇచ్చి పంపించారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో వాటిని ధరించి ఇలా సంతోషం వ్యక్తం చేశారు ఆ గిరిజనులు.












Click it and Unblock the Notifications