ఎపి:రూ. 9400 కోట్లతో...గ్రామాలకు తాగు నీటి సదుపాయం
అమరావతి:గ్రామాల్లో తాగునీటి వనరులను అభివృద్ధి చేసేందుకు రూ. 9400 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తదనుగుణంగా కార్యాచరణకు సంసిద్దమవుతున్నారు.
ఇటీవలే రూ.4వేల కోట్లతో పల్లెల్లో తారు, సిమెంట్తో లింకు రోడ్లు నిర్మించాలని ఉత్తర్వులు జారీచేసిన పంచాయతీరాజ్ శాఖ తాజాగా తాగునీటి వసతుల కల్పనపై దృష్టిపెట్టింది. 5 జిల్లాల్లో తాగునీటి ప్రాజెక్టులను మంజూరుచేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. వీటిని పీపీపీ విధానంలో హైబ్రిడ్యాన్యుటీ ప్రకారం చేపట్టనున్నట్లు తెలిసింది.

పంచాయితీరాజ్ శాఖా మంత్రి పదవీబాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రతి ఇంటికీ కుళాయి నీటిని అందిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో ఆ హామీకి అనుగుణంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగునీటి ప్రాజెక్టులను మంజూరుచేస్తూ పంచాయితీ రాజ్ శాఖ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా కడప జిల్లాకు రూ.1,800 కోట్లు, కర్నూలుకు రూ.1,449 కోట్లు, అనంతపురానికి రూ.1,904 కోట్లు, చిత్తూరుకు రూ.2,607కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.1,640 కోట్లు కేటాయించారు. పీపీపీ విధానంలో హైబ్రిడ్యాన్యుటీ ప్రకారం వీటి వినియోగం చేపడతారు. 70 ఎల్పీసీడీల తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటారు. వీటికి డీపీఆర్లను సిద్ధం చేసి ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకోవాలని తాగునీటి సరఫరా కార్పొరేషన్ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులతో ఐదు జిల్లాల్లో 2,792 పథకాల ద్వారా 23,208 నివాసిత ప్రాంతాల్లోని 1.30కోట్ల జనాభాకు తాగునీటిని అందించనున్నారు.












Click it and Unblock the Notifications