ఎంసెట్-2018...ఈ నెల 9 లేదా 10న నోటిఫికేషన్
అమరావతి: ఎంసెట్-2018 నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆన్లైన్ ఏజన్సీని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
మరో 2, 3 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నందున ఈ నెల 9 లేదా 10న ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశముంది. ఇదే విషయమై చర్చించేందుకు సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయరాజు నేతృత్వంలో ఎంసెట్, సెట్ కమిటీ సమావేశమైంది.ఈ సమావేశంలో కన్వీనర్ సీహెచ్ సాయిబాబు (జేఎన్టీయూకే)తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంసెట్ కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు ఫీజును ఈసారి కూడా రూ.450గానే నిర్ణయించారు.
జనవరి నెలలో వివిధ సెట్ల తేదీల విడుదల సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంసెట్ కు సంబంధించి కీలక సమాచారం వెల్లడించారు. ఈ ఏడాది ఎంసెట్ కోసం 115 నుంచి 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గతేడాది ఇంజనీరింగ్లో 1.36 లక్షల సీట్లుంటే 84,478 సీట్లు భర్తీ అయ్యాయని, 52,250 సీట్లు ఖాళీగా ఉండిపోయాయని వివరించారు. సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చర్యలు తీసుకున్నామన్నారు.