ఆర్కే రోజాకు ఏపీ సర్కార్ షాక్ ? రూ.400 కోట్లపై ఏసీబీ విచారణ..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాకు భారీ షాక్ ఇచ్చేందుకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.400 కోట్ల అవినీతికి సంబంధించి ఆమెను టార్గెట్ చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని లాంఛనంగా ప్రశ్నించడం, చర్యలు తీసుకుంటామని ప్రకటన చేయడం కూడా జరిగిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించబోతోంది.
గత ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యువతకు క్రికెట్ కిట్లు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా పోటీలు నిర్వహించారు. ఇందులో దాదాపు రూ.119 కోట్లను 45 రోజుల్లోనే ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ నిధుల్ని మళ్లించి మొత్తంగా రూ.400 కోట్ల మేర ఈ పథకం కోసం ఖర్చు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న అసెంబ్లీలో ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా.. క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్యాప్తు చేయిస్తామన్నారు. ఈ మేరకు ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై ఏసీబీతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం సిఫార్సు చేయబోతోంది.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అమల్లో అప్పటి క్రీడామంత్రి ఆర్కే రోజా కీలక పాత్ర పోషించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆమెను ఫిక్స్ చేసేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. ఈ నిధుల విడుదల కోసం రోజా మంత్రిగా ఇచ్చిన ఆదేశాలు, క్షేత్రస్దాయిలో పెట్టిన వాస్తవ ఖర్చు, ఇలా ప్రతీ అంశంపై వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా త్వరలోనే ఏసీబీ దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేస్తారని సమాచారం. అదే జరిగితే రోజాకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అప్పట్లో ఈ కార్యక్రమం ప్రారంభానికి హాజరైన సీఎం జగన్ కోసం భారీగా ఖర్చుపెట్టారని, ముగింపుకు అంతకు మించి ఖర్చు చేసినా జగన్ రాలేదనే అంశాన్ని కూడా టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు.












Click it and Unblock the Notifications