చంద్రబాబు అభ్యర్దనకు మోదీ అంగీకరిస్తారా..!!
ఏపీలో ప్రధాన ప్రాజెక్టుల భవిష్యత్ కేంద్ర సహకారం పైన ఆధార పడింది. అమరావతి..పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. అమరావతికి రూ 15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. పోలవరం కొత్త డీపీఆర్ కు ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి తాజాగా మరో అభ్యర్ధన అందింది. దీని పైన ఇప్పుడు తీసుకొనే నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది.
కేంద్రానికి ప్రతిపాదన
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరో ప్రతిపాదన సిద్దం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రం వాల్, దానిపై ఎర్త్ కమ్ రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం నిర్మాణాలను సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే రూ.7 వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది. ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు రూ.12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది.

తాజా నిర్ణయంతో
2025 మార్చిదాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది. దీంతో వెంటనే రూ.7 వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పంపనుంది. కేంద్రం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది. ఇంకోవైపు.. ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,127 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించడం.. కొత్త వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలను వచ్చే నవంబరు నుంచే మొదలుపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం కసరత్తు
కొత్త టెండర్లకు వెళ్లకుండా.. ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబరు నుంచి కొత్త వాల్ నిర్మాణ పనులు చేస్తూనే.. దానిపై సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం కూడా కట్టడం వల్ల రెండు సీజన్లు కలిసొస్తాయని.. ఏడాదిన్నరలోనే ఈ రెండు కీలక నిర్మాణాలు పూర్తవుతాయని విశ్వసిస్తోంది. జలశక్తి శాఖ కూడా 2027 నాటికి పోలవరం తొలిదశ పూర్తికావాలని లక్ష్యం విధించింది. దీంతో, ఇప్పుడు కేంద్ర నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications