'తల్లికి వందనం' రూ 13 వేలు, లిస్టులో లేకపోతే ఇలా - అమలు వేళ కీలక నిర్ణయం..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సమయాన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రతీ విద్యార్ధికి రూ 15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగానే రూ 13 వేలు జమ చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఒకటో తరగతి .. ఇంటర్ లో అడ్మిషన్ పొందిన వారికి డేటా అందిన తరువాత వారికి పథకం అమలు చేయనున్నారు.
రూ 13 వేలు చొప్పున
ఏపీ ప్రభుత్వం నేటి నుంచి తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ 15 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం పైన ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేసింది. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో రూ.1,000 చొప్పున మినహాయించి మిగిలిన రూ.13వేలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

వారికీ అమలు
అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్ ఫస్టియర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి, నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా 2023లో 'అమ్మ ఒడి' పథకం అమలు చేసింది. ఇక, ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.












Click it and Unblock the Notifications