శ్రీకాకుళం కలెక్టర్ పై హైకోర్టు సీరియస్-బెయిలబుల్ వారెంట్ జారీ
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పై హైకోర్టు ఇవాళ సీరియస్ అయింది. ఆయనకు ఓ కోర్టు ధిక్కార కేసులో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల్ని పాటించడంలో విఫలం కావడంతో కలెక్టర్ కు ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఓ కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు గైర్హాజరు కావడంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాల్ని ఆయన ఇప్పటివరకూ పట్టించుకోలేదంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారిక పనుల కారణంగా జిల్లా కలెక్టర్ హైకోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కలెక్టర్పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు... పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గత ఏడాది మే 3న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది.
దీన్ని అమలు చేయకపోగా.. హైకోర్టు ఆదేశాల ప్రకారం కోర్టుకు కూడా హాజరుకాకపోవడంతో ఇవాళ సీరియస్ అయిన న్యాయస్దానం.. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయన త్వరలో హైకోర్టుకు హాజరై వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.