తప్పు చేస్తే ఉరేసుకుంటా: మీడియాపై ఏపీ మంత్రి
విశాఖ: తాను తప్పు చేస్తే ఉరేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఉద్వేగంతో అన్నారు. తాను ఎప్పుడు తప్పు పనులు చేయలేదని చెప్పారు. ఆయన పత్రికల పైన మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నర్సీపట్నంలో నవ నిర్మాణ దీక్ష ప్రారంభ సమయంలో మాట్లాడారు. కొన్ని పత్రికల్లో తన పైన అవాస్తవాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన పైన ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
నేడు, రేపు జగన్సమర దీక్ష
తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధ, గురువారాల్లో సమర దీక్ష చేపట్టనున్నారు.
మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ సమీపంలో ఎన్నారై ఆసుపత్రి ఎదురుగా జాతీయ రహదారి వెంట రెండెకరాల విస్తీర్ణంలో దీక్షా వేదికను ఏర్పాటు చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి నేతృత్వంలో దీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
వివిధ జిల్లాల నుంచి తరలిరానున్న రైతులు, మహిళలు, వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం ఉదయం జగన్ దీక్షను ప్రారంభిస్తారని చెప్పారు.