UPI Payments: ఇక ఫ్రీ కాదు, తేల్చేసిన ఆర్బీఐ గవర్నర్!
వీధి చివర పాన్ షాపు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు.. జేబులోంచి రూపాయి తీయకుండా ఫోన్ స్కానింగ్తో పేమెంట్స్ పని ముగించే అలవాటు మన దేశంలో ఒక సంచలనం. రూపాయి కూడా ఛార్జ్ పడకుండా ఉచితంగా అందుతున్న ఈ డిజిటల్ సేవలు ఇకపై కూడా ఉచితంగానే ఉంటాయా? లేక మన ఖాతాల నుంచి కొత్తగా ఛార్జీలు కోత పడతాయా? ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త బిల్లు, దానికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తుపై కొత్త సంకేతాలను ఇస్తున్నాయి.
నిజానికి, 2020 నుంచి మన దేశంలో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (ఎండీఆర్) పేరుతో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధన అమలులో ఉంది. అయితే, ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పన్నుల చట్టాల సవరణ బిల్లు-2026 ద్వారా ఈ నిబంధనల్లో కీలక మార్పులు చేయబోతోంది.

ఏ రకమైన డిజిటల్ చెల్లింపులను ఉచితంగా ఉంచాలి, ఏ మూలలకు ఛార్జీలు వర్తింపజేయాలో నిర్ణయించే పూర్తి అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోబోతోంది. అంటే, ఇకపై కొన్ని నిర్ణీత చెల్లింపులకు మినహాయింపునిస్తూనే, మరికొన్ని లావాదేవీలకు బ్యాంకులు లేదా పేమెంట్ సంస్థలు సేవా రుసుములు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖర్చు ఎవరో ఒకరు భరించాల్సిందే: ఆర్బీఐ గవర్నర్!
ఇదే విషయంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాను ప్రశ్నించగా.. "ఈ ఖర్చును ఎవరు భరిస్తారనేది చెప్పడం ప్రస్తుతం చాలా తొందరపాటే అవుతుంది, కానీ చెల్లింపుల వ్యవస్థ నడవాలంటే ఆ ఖర్చును ఎవరో ఒకరు కచ్చితంగా భరించాల్సిందే" అని స్పష్టం చేశారు. సాంకేతిక వ్యవస్థలు, సైబర్ భద్రత, బ్యాంకింగ్ నెట్వర్క్ నిర్వహణకు భారీగా ఖర్చు అవుతుందని.. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందా, వ్యాపారులు కడతారా లేక పరోక్షంగా ప్రజలపై పడుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలుతుందని ఆయన వివరించారు. ప్రత్యక్షంగా వినియోగదారుడిపై రుసుము వేయకపోయినా, వ్యాపారుల ద్వారా వస్తువుల ధరల రూపంలో లేదా ఆర్థిక వ్యవస్థ రూపంలో ఆ భారం పడుతుందని పరోక్షంగా గుర్తుచేశారు.
రూ. 2,000 నిబంధన ఎంతవరకు నిజం?
సామాన్యులు ఒకరికొకరు చేసుకునే వ్యక్తిగత డబ్బుల బదిలీలకు (పి2పి) ఉచిత సేవల నిబంధన కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రూ. 2,000 దాటి పెద్ద మొత్తంలో వ్యాపారులకు చేసే లావాదేవీలపై 0.25 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మన దేశంలో జరుగుతున్న మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్యలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైనవి కేవలం 5 శాతమే అయినప్పటికీ, చేతులు మారే మొత్తం డెబ్బై శాతానికి పైగా ఉండటమే దీనికి కారణం. అలాగే పెద్ద తరహా వ్యాపారులకు మాత్రమే ఈ రుసుము వర్తింపజేసేలా మరో ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సవరణల ప్రక్రియ పరిశీలన దశలోనే ఉన్నందున, ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఉచిత విధానమే యథాతథంగా కొనసాగుతుంది.














Click it and Unblock the Notifications